Suryaa.co.in

Andhra Pradesh

ఏనుగుల బీభత్సం.. ఐదుగురు మృతి

– అటు పులులు.. ఇటు ఏనుగులు
– జంతువుల దాడితో చనిపోతున్న జనం
– ఫారెస్ట్-రెవిన్యూ-పోలీసుల మధ్య సమన్వయ లోపం

చిత్తూరు: రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నివసించే జనాలకు జంతువుల దాడి శాపంగా మారుతోంది. హటాత్తుగా వచ్చి.. ఊళ్ల మీద పడి చిక్కిన వారిని చిక్కినట్లు చంపేస్తున్న జంతువుల దాడికి, డజన్ల మంది చనిపోతున్న విషాదం ఇంకా కొనసాగుతోంది. చిత్తూరు, కడప జిల్లా సరిహద్దులు మృత్యువేదికగా మారాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో శివరాత్రి పర్వదనంలో మునిగి ఉన్న జనాలపై, ఏనుగులు స్వైరవిహారం చేశాయి. ఫలితంగా ఐదుగురు మృత్యువాత పడిన విషాదం. అటవీ-రెవిన్యూ-పోలీసు శాఖ సమన్వయ లోపం, సరిహద్దు ప్రజలకు శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో శివరాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి.

ఈ ఘటనలో వై.కోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో ..గత కొంత కాలంగా అడవి జంతువులు తరచూ జనావాసాల్లోకి ప్రవేశించి, ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత, ఏనుగుల దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్లకూడదని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

LEAVE A RESPONSE