పీఆర్సీపై అనుమానాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చు

– ముగిసిన ప్రభుత్వ కమిటీ సమావేశం
– చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడి
– ఉద్యోగులు అపోహలు వీడాలని సజ్జల హితవు

పీఆర్సీపై ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, చర్చలు, కమిటీపై అపోహలు వీడాలని సజ్జల పిలుపునిచ్చారు. ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమేరకు మంచి చేశామో తాము చెబుతున్నామని సజ్జల పేర్కొన్నారు. అలా కాకుండా ప్రభుత్వ కమిటీని గుర్తించబోమని ఉద్యోగులు పేర్కొనడం ప్రతిష్టంభనను మరింత పెంచడమేనని తెలిపారు.

Leave a Reply