– డేటా సిటీల ఏర్పాటుకు సింగిల్ విండో అనుమతులు ఇవ్వండి
– కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్ భవన్ లో కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రైల్వే బడ్జెట్ లో ఎపికి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను మంగళగిరి చేనేత శాలువాతో మంత్రి నారా లోకేష్ సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలు, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. ఏపీలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో త్వరితగతిన అనుమతులు ఇవ్వడమే కాకుండా, ప్రాజెక్టులు త్వరితగతిన ఏర్పాటయ్యే విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ చెప్పారు.
ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సిటీకి సహకరించాలని కోరారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీలకు పెద్దఎత్తున డిమాండ్ రాబోతుంది. ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి. డేటా సిటీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుతో ఏపీ యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇందుకు మీ సహకారం అవసరం. 2047 కి 30 ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థ చేరాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం.
కేంద్ర సహకారంతో ఏఐ రంగంలో రాబోతున్న అవకాశాలు అందిపుచ్చుకొని వికసిత్ భారత్ లక్ష్యంలో ఏపీ భాగస్వామి అవుతుంది. ఐదేళ్ల లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాం. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించండి. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తామని… కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను మంత్రి లోకేష్ కోరారు.