– ఏడుగురి నిందితుల అరెస్టు
– ఎస్పీ సతీష్ కుమార్
తెనాలి: చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దొరికిన ఘటన గుంటూరు జిల్లా, తెనాలి మండలంలో చోటుచేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో చోరీకి పాల్పడిన కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తెనాలి డిఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ ఏడుగురు నిందితులను మీడియా ముందు హాజరుపరిచి, మాట్లాడారు. తెనాలి మండలం సంగం జాగర్ల మూడి గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద గంజాయిను చిన్న పొట్లాలుగా చేసి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న ఏడుగురు నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుల్లో అమ్మిశెట్టి శివచందు, సిద్ధార్థ, పవన్, సాయి పలు పోలీస్ స్టేషన్ల వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చి ఏడుగురు సభ్యుల ముఠా యువత ప్రధానంగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నారన్నారు. నిందితుల్లో ప్రధానమైన అమ్మిశెట్టి శివ చందు పై గతంలోనే 10 కేసులు ఉన్నాయన్నారు. శివ చందు, సిద్ధార్థ, పవన్ సాయి పది బైకులు, 13 గ్రాములు బంగారం వస్తువులను దొంగిలించిన కేసుల్లో నిందితులని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు,తెనాలి డిఎస్పి బి జనార్దన్ రావు, సీఐ టి వెంకటేశ్వర్లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు