– కొండపోచమ్మ నుంచి మూసి అనుసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు?
– డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక
– యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
భువనగిరి: మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ. 60 లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు… జాగ్రత్తగా ఉండండి.
ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదు మాది. మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి మాది. మూసి మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలి. పారిశ్రామిక వ్యర్ధాలు మూసిలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది ?
మూసీ నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారు. మూసిలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.
మూసిని కాంగ్రెస్ నాయకులు ఏటీఎం గా తయారు చేసుకోవాలని చూస్తున్నారు. హైదరాబాదుకు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి, దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసి – గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. అందుకే అనుసంధాన ప్రాజెక్టు వేయండి రూ 7500 కోట్లకు పెంచారు.
రూ. 7500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. కొండపోచమ్మ నుంచి మూసి అనుసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు? నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి.
మూసీ ప్రక్షాళనకు అయ్యే వ్యయం 50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారు. మూసిని ఏటీఎంగా మార్చుకొని… వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక వేసుకున్న సీఎం. యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలి. ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసిఆర్ ది. అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదు.