Suryaa.co.in

Telangana

తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్

– వెబ్ వెర్క్స్ రూ. 5,200 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు.

తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్‌ వర్కింగ్-హెవీ డేటా సెంటర్‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే కొన్ని సంవత్సరాలలో గ్రీన్‌ ఫీల్డ్ హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌ విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది.

తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. డేటా సెంటర్ల ద్వారా ఐటీ రంగం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందని అన్నారు. పెట్టుబడిదారులు అందుకు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని అన్నారు. ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, తాము ఎంచుకున్న ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెపుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం, దేశంలో తమ డేటా సెంటర్ కార్యకలాపాలను విస్తరించడంపై ఐరన్ మౌంటైన్ ఆనందం వ్యక్తం చేసింది. ‘తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన ప్రాధాన్యతలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మా డేటా సెంటర్‌లలో 100% పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నాము. దీనిని భారతదేశంలో విస్తరించాలని చూస్తున్నాం. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం డేటా సెంటర్లు మరియు పునరుత్పాదక ఇంధనం రెండింటికి మద్దతు అందించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చింది.. ”అని విలియం మీనీ అన్నారు.

LEAVE A RESPONSE