Suryaa.co.in

Andhra Pradesh

భలే పోలీసులు బాసూ!

– పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు
– వైసీపీ కార్యకర్తలకు భయపడిన పోలీసుల వీరత్వం
– పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇదో వి‘చిత్రం’
– కృష్ణవేణిని చూసేందుకు స్టేషన్‌కు పోటెత్తిన వైసీపీ కార్యకర్తలు
– అనుమతి లేదన్నా వినకుండా కార్యకర్తలు ఒత్తిడి
– భయంతో తాళం బదులు బేడీలు వేసిన పోలీసులు
– పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తల విస్మయం

సహజంగా పోలీసులు ఏదైనా సమాచారంతో దాడికి వెళితే జనం పారిపోతారు. మరికొందరు ఇళ్లలోకి వెళ్లి తాళాలు వేసుకుంటారు. కానీ పోలీసులే ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు ఎక్కడ పోలీసుస్టేషన్‌లోకి దూసుకువస్తారోనని భయపడి, ఏకంగా స్టేషన్ గేటుకు బేడీలతో తాళం వేసిన వీరత్వం గురించి ఎప్పుడైనా విన్నారా? కన్నారా?.. ఇప్పుడు వినండి.. కనండి. అలాంటి వీరులున్న పోలీసుస్టేషన్ మరెక్కడో లేదు.. పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో దర్శనమిచ్చింది!

ఇంతకూ ఏం జరిగిందంటే.. పవన్ బిడ్డకు, మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన పాలేటి కృష్ణవేణి అనే వైసీపీ మహిళా కార్యకర్తను, దాచేపల్లి పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లి మరీ అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. మరుసటి రోజు ఆమెను కోర్టుకు హాజరుపరిచేపనిలో ఉన్నారు. ఈలోగా తమ పార్టీ కార్యకర్త కృష్ణవేణిని పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారని తెలిసిన వైసీపీ కార్యకర్తలు, భారీ సంఖ్యలో దాచేపల్లి పోలీసుస్టేషన్‌ను తరలివచ్చారు.

ఆమెను కలసి పరామర్శిస్తామని పట్టుపట్టారు. అయితే అందుకు నిబంధనలు ఒప్పుకోవని పోలీసులు స్పష్టం చేశారు. అయినా సరే పట్టువదలని వైసీపీ కార్యకర్తలు, స్టేషన్‌లోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. దీనితో గత్యంతరం లేక పోలీసులు, ఏకంగా ఖైదీలకు వేసే బేడీలతో పోలీసుస్టేషన్ గేటుకు తాళాలు వేశారు. ఇదీ పౌరుషానికి మారుపేరయిన పల్నాడు ప్రాంతంలో పోలీసుల వీరత్వం!

ఏపీ పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఓ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులకు.. ఆమెను చూసేందుకు వస్తున్న సదరు పార్టీ నాయకులను ఎలా అడ్డుకోవాలో తెలియలేదు. దీంతో ఆమెకు వేయాల్సిన బేడీల్ని కాస్తా, ఏకంగా పోలీసు స్టేషన్ గేట్లకే వేసారు. దీంతో ఈ వ్యవహారం పల్నాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా, టీడీపీ, ఇతర కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణిని పల్నాడు పోలీసులు నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మందకృష్ణ మాదిగ భేటీ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదం కావడంతో దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసిన పోలీసులు.. నిన్న రాత్రి దాచేపల్లికి తీసుకొచ్చారు. ఆమెను ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆలోపు పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసిన సమాచారంతో వైసీపీ నాయకులు దాచేపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఆమెను కలిసేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులు మాత్రం వారిని ఆమెను కలిసేందుకు అనుమతి లేదని చెప్పేశారు. అయినా వారు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఏకంగా స్టేషన్ కు ఖైదీలకు వేసే బేడీలు వేసినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు వచ్చిపోయే ప్రభుత్వ కార్యాలయమైన పోలీసు స్టేషన్ కు, ఇలా బేడీలు వేయడం ఏంటనే చర్చ జరుగుతోంది.

పోలీసుస్టేన్‌కు తాళం వేసిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ కార్యకర్తలు విస్తుపోతున్నారు. కొన్ని డజన్ల మంది వైసీపీ కార్యకర్తలను అడ్డుకోలేని పోలీసులు, రేపు అదే డజన్ల సంఖ్యలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపైకి దాడులు చేస్తే దిక్కెవరు? ఇలాగైతే మా ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం? దాచేపల్లి పోలీసులకు వేయండి రెండు వీరతాళ్లు!

LEAVE A RESPONSE