ఒకప్పుడు దేశంలో జై జవాన్ జై కిసాన్.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నై కిసాన్

– ఏపీలో జగన్ కేంద్రం మాట విని మీటర్లు పెట్టిండు
– కేంద్రంపై హరీష్ ఫైర్
తెలంగాణ వడ్లు కొనేదిలేదన్న కేంద్రంపై మంత్రి హరీష్‌రావు అగ్గిరాముడయ్యారు. పంజాబ్‌లో పూర్తిగా కొంటామన్న కేంద్రం, తెలంగాణ రైతులు పండించిన వడ్లను ఎందుకు కొనదని నిలదీశారు. ఈ పోరాటం అంతం కాదు. ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.
వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ మహా ధర్నా చేపట్టింది. సిద్దిపేటలో జరిగిన ధర్నాలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోరాటం ఇప్పుడే మొదలైంది.. ఇది ఆరంభమే.. మున్ముందు మరింత ఉదృతం చేస్తామని ఒకింత కేంద్రాన్ని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అసమంజస విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. ఏడేళ్ల టీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మేలు జరుగుతున్నదని.. నేడు కాళేశ్వరంతో ఏ ఊర్లో చూసిన చెరువులు అన్ని నిండు కుండల్లా కళకళలాడుతున్నాయని హరీష్ చెప్పుకొచ్చారు.
‘రైతులు జర బాగుపడుతుంటే కేంద్రం యాసంగిలో వడ్లు కొనమంటున్నారు. యాసంగిలో తెలంగాణలో దొడ్డు వడ్లు పండుతాయి.. అవి బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయి. పంజాబ్‌లో మొత్తం వడ్లు మొత్తం ఎలా కొంటారు..?.. తెలంగాణలో ఎందుకు కొనరు..?. దేశంలో రైతుకు పెట్టుబడి సాయం, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒక్క వ్యవసాయం మీదనే ప్రభుత్వం 30 వేళ కోట్లు ఖర్చు చేస్తున్నది. నాడు రైతు కళ్ళల్లో కన్నీళ్లే.. నేడు ఏడేళ్ల టీఆర్ఎస్ హయాంలో ఎక్కడ చూసినా నీళ్లే.. నీళ్లు. ఆంధ్రలో సీఎం జగన్.. కేంద్ర సర్కారు నిబంధనలు అనుసరించి బాయిల కడా మీటర్లు పెట్టిండ్లు. ఒకప్పుడు దేశంలో జై జవాన్ జై కిసాన్ నినాదం ఉండేది.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నై కిసాన్ అంటున్నది. దేశంలో వడ్లు కొనాల్సిన భాద్యత కేంద్రానిదే.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి సారి వడ్లు కొనబోమని చెప్పిన ఘనత బీజేపీదే. ‘ఇప్పటికైనా కేంద్రం పద్ధతి మార్చుకోకపోతే.. రైతుల కోపాగ్నికి కమలం వాడిపోక తప్పదు. ప్రశ్నించే రైతులపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడని అనడం దేశభక్తా..?’అని కేంద్రంపై తీవ్రస్థాయిలో హరీష్ మండిపడ్డారు. వడ్లు కొనాలని రైతులు.. ప్రధాని మోదీకి ట్వీట్లు చేయాలని ఈ సందర్భంగా హరీష్ సూచించారు.

Leave a Reply