Suryaa.co.in

Andhra Pradesh

ఇదిగో.. విశాఖలో వైసీపీ భూకబ్జాల ఆధారాలు

– జగన్, ధనంజయరెడ్డి, విజయసాయి, భారతీరెడ్డి సేవలో కలెక్టర్ మల్లికార్జున
– విశాఖ భూములను వైఎస్సార్సీపీ పెద్దలకు కలెక్టర్‌ కట్టబెట్టారు
– మరిన్ని ఆధారా లు బయటపెట్టిన జనసేన నేత మూర్తి యాదవ్‌

విశాఖపట్నం: ప్రీ ఆఫ్‌ సర్టిఫికెట్‍ సాకుగా చూపి విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను దోచేశారని, జనసేన నేత మూర్తి యాదవ్‌ ఆరోపించారు. గతంలో ఇవ్వకుండా మిగిలిన భూముల రైతులను బెదిరించి సీఎస్‌ బినామీలు రాయించుకున్నారని తెలిపారు. ఈ కుట్రలో జిల్లా కలెక్టర్‌ కూడా భాగస్వామ్యమయ్యారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన పలు ఆధారాలను మూర్తి యాదవ్‌ మీడియా ముందు వెల్లడించారు.

విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున బాధ్యత చేపట్టిన రోజు నుంచి వైఎస్సార్సీపీ పెద్దలకు భూములు అప్పజెప్పే పనులు చక్క బెట్టారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్ మల్లికార్జునది ఒకే జిల్లా కడప జిల్లా కావడంతో రాజధాని పేరుతో విశాఖ సమీపంలో, భోగాపురం సమీపం భూములను కలెక్టర్ పదవి లో ఉండి వైఎస్సార్సీపీ నేతలకు కట్టబెట్టే పనికి పూనుకున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు.

సీఎస్ జవహర్ రెడ్డి బినామీ త్రిలోక్, సుభాష్లు నేరుగా రైతులు దగ్గరకి వెళ్లారని మూర్తి యాదవ్ ఆరోపించారు. రైతులను బెదిరించి, వారి భూములను రాయించుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ తెచ్చుకునట్టు పేర్కొన్నారు. గండి గుండం గ్రామంలో కనకాల చిన్న అనే రైతు నుంచి 1.2 ఎకరాల భూమి రాయించుకున్నారని తెలిపారు. సర్వ్ నెంబర్ 288/1 కనకాల అప్పారావు భూమి రాయించుకున్నారని చెప్పారు. సురెడ్డి త్రిలోక్, సుభాష్ ద్వారా రెవిన్యూ అధికారులు సర్టిఫికెట్లు జారీలో కోట్ల రూపాయాలు ముడుపులు అందుకున్నారనీ మూర్తి యాదవ్ ఆరోపించారు.

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వచ్చాకా దశపల్లా భూములు, హాయగ్రీవా భూములు, రామానాయుడు స్టూడియో భూములను మార్పు చేశారని మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి కుమార్తె నిర్మాణాలకు కలెక్టర్ సహకరించారని ఆరోపించారు. రుషికొండ కు అనుమతులు కూడా ఈ మల్లికార్జున ఇచ్చారని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, భారతిల సేవలో తరిస్తున్నారని మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎస్ జవహర్ రెడ్డి చేసిన అవినీతి ఇప్పటి వరకు దేశంలో మరెవ్వరూ చెయ్యలేదని ఆరోపించారు. విశాఖ జిల్లా కలెక్టర్ గా ఉండి మల్లికార్జున అవినీతి పరులకు వంతపాడుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర రైతులను అమాయకంగాకనిపించారా అని ప్రశ్నించారు.

కడప నుంచి వచ్చి దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 596 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేది కూటమి ప్రభుత్వం అని, అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో 72 గంటలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతోందని ధీమా వ్యక్తం చేశారు

LEAVE A RESPONSE