Suryaa.co.in

Andhra Pradesh

ఏబీకి హైకోర్టు క్లీన్‌చిట్

– ఏసీబీ కోర్టులో వేసిన చార్జిషీట్‌ను కొట్టేసిన హైకోర్టు
-ఏసీబీ కోర్టు విచారణ నిలిపివేస్తూ ఆదేశాలు
– జగన్ సర్కారుది కక్షసాధింపేనని తేలిన వైనం

అమరావతి: జగన్ సర్కారు వేధించి వెన్నాడిన మాజీ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఐదున్నరేళ్ల తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ, జగన్ సర్కారు పెట్టిన తప్పుడు కేసుకు ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింది. ఇంటిలో జరిగిన శుభకార్యాలకు సన్నిహితులు, చివరకు బ్యాచ్‌మేట్లు, ఆయన వద్ద పనిచేసిన అధికారులు సైతం ముఖం చాటేసిన దుస్థితి.

హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించిన ఒక అధికారిని, ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేసిన ఘనత జగన్ సర్కారుదే. ఇప్పుడు హైకోర్టు.. నాటి జగన్ నియంత నిర్ణయాన్ని తప్పుపట్టి, ఏబీవీపై బనాయించిన అక్రమ కేసును కొట్టివేసింది. ఒక ప్రభుత్వం తలచుకుంటే ఐపిఎస్ అధికారులయినా సరే ఎంత వేదన అనుభవిస్తారన్నది ఏబీ కేసు నిరూపించింది.

జగన్ సర్కారుపై నాలుగున్నరేళ్లు అలుపెరుగని న్యాయపోరాటం చేసిన ఇంటలిజన్స్ మాజీ ఏడీజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టులో వేసిన ఛార్జ్ షీట్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణను కూడా న్యాయస్థానం నిలిపివేసింది. గతంలో ఈ కేసుపైనే ఏబీ వెంకటేశ్వర రావును గత ప్రభుత్వం సస్పెండ్ చేసి వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే.

ఇంటలిజన్స్ ఏడీజీ గా ఉన్న ఏబీ.. ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని సస్పెండ్ చేసింది. భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2021లో ఏబీవీపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది.

అయితే తనపై సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఏబీ కోర్టును ఆశ్రయించగా, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించింది. ఆ తరువాత 2022లో మరోసారి సస్పెండ్ చేయగా, దీనిపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

అక్కడ కూడా ఏబీపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించారు. రెండు సార్లు గత ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఒకసారి, 2022 జూన్‌ 28 నుంచి 2024 మే 30 వరకు రెండోసారి సస్పెన్షన్ వేటు వేసింది.

చివరకు క్యాట్ ఆదేశాల మేరకు ఆయన రిటైర్మెంట్‌‌కు ఒకరోజు ముందు వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వగా, కొన్ని గంటల్లోనే రిటైర్ అయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీవీపై గత ప్రభుత్వం హయాంలో నమోదైనా అభియోగాల్లో నిజం లేదని విచారణలో తేల్చింది.

ఏబీవీపై విధించిన సస్పెన్షన్‌ కాలాన్ని క్రమబద్ధీకరించింది. ఏబీ నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఆదేశించింది. సస్పెన్షన్‌ సమయంలో విధులు నిర్వహించినట్లుగా గుర్తించి వేతన, అలవెన్సుల చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఏబీపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా నిఘా పరికరాల కేసులో ఏబీపై వేసిన చార్జిషీట్‌ను కొట్టివేయడంతో, గత జగన్ సర్కారు కావాలనే ఆయనను వేధించి పోస్టింగ్ ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నది స్పష్టమయింది.

LEAVE A RESPONSE