క్రిస్మస్ స్టార్లపై హిందూ సంస్థల నిఘా!

– తెలుగు రాష్ట్రాల్లో రంగంలోకి 34 వేల మంది హిందూ సైనికులు
– మతం మారిన వారి ఇళ్లపై హిందూ సైనికుల నిఘా
– ఐపిఎస్, ఐఏఎస్ స్థాయి అధికారులపైనా..
– ఫొటోలతో ఎమ్మార్వోలకు ఫిర్యాదులు
– నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి స్టార్ల వ్యవహారం
( మార్తి సుబ్రహ్మణ్యం)
క్రిస్మస్ సందర్భంగా మీ ఇంటిపై స్టార్లు ఏర్పాటుచేసుకుంటున్నారా? ఫర్వాలేదు. మీరు నిజంగా జన్మతః క్రైస్తవులయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ద్వారా సంక్రమించే హక్కులు అనుభవిస్తూనే క్రైస్తవ మత సంప్రదాయాలు అనుసరిస్తున్న వారికే ఇబ్బందంతా! అర్ధం కావడం లేదా? అయితే ఇది చదవండి. స్టార్లు, క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటే వచ్చే ఇబ్బందేమిటో?!
తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా పెరుగుతున్న క్రైస్తవమత విస్తరణపై ఆందోళన చెందుతున్న హిందూ సంస్థలు ఈ ఏడాది సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాయి. చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులు అనుభవిస్తూ, ఆమేరకు రాజ్యాంగం కల్పించిన సౌక ర్యాలు పొందుతున్న కొన్ని వేల కుటుంబాలు క్రైస్తవ మత ఆచారాలు అనుసరిస్తున్నాయి. చివరకు హిందూ దే వాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా, క్రైస్తవ మతాచారాలు పాటిస్తున్నట్లు హిందూ సంస్థల సర్వేలో తేలింది. ఆ మేరకు ఇప్పటివరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, దేవదాయశాఖ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.
ఎల్వీ సుబ్రమణ్యం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు.. ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రచారంపై పెద్ద రగడ జరిగింది. దానితో ఆయన టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా తాము హిందువులమేనని, హిందూ మత సంప్రదాయాలు పాటిస్తున్నామనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ హిందూయేతరులు పనిచేస్తుంటే, వారిని మరొక శాఖలకు సర్దుబాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఆ విషయాన్ని ఆయన సీఎం జగన్ విదేశాల్లో ఉన్న సమయంలో సమాచారం అందించారు. ఆ తర్వాత పద్మజ దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే, దానికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీచేశారు. అయితే వారిద్దరి ఆదేశాలు ఇంతవరకూ అమలుచేయని విషయాన్ని, హిందూ సంస్థలు టీటీడీ, దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి.
ఇప్పటికీ టీటీడీలో అధికారికంగా దాదాపు 250 మంది వరకూ వివిధ స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులు క్రైస్తవం అనుసరిస్తున్నారని, వారు ఆదివారం చర్చిలకు వెళుతున్నారన్న విషయం హిందూ సంస్థల సర్వేలో వెల్లడయింది. గతంలో ఓ అధికారి టీటీడీ వాహనంలోనే చర్చికి వెళ్లి, ప్రార్ధనలు చేసిన వీడియో ఒకటి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదేవిధంగా శ్రీశైలం, ద్వారకాతిరుమల ఆలయాల వద్ద అన్యమత ప్రచారం జరుగుతోందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, ఇప్పటి దాకా ఎవరూ పట్టించుకోలేదని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో 70 శాతం మంది దళితులు, గిరిజనులు, కొందరు బీసీలు తమ కులాల ద్వారా రిజర్వేషన్లు పొందుతూనే క్రైస్తవం పాటిస్తూ, చర్చిలకు వెళుతున్నట్లు హిందూ సంస్థల అంచనా. గోదావరి జిల్లాల్లో కొంతమంది కాపులు కూడా ఫాదర్లు, పాస్టర్లుగా ఉన్నట్లు తేలింది.
తాము ప్రభుత్వాలకు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా ప్రభుత్వం పట్టించుకోనందున, ఈ ఏడాది నుంచీ ఇకపై యాక్షన్‌ప్లాన్‌కు దిగాలని హిందూ సంస్ధలు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఆ మేరకు క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటుచేసే ఇళ్లను గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దానికోసం ఏపీ-తెలంగాణలో 34,800 మంది హిందూ సైనికులను నియమించారు. హిందూ పరివార్ సంస్థలకు చెందిన కార్యకర్తలతోపాటు, అదనంగా ఏబీవీపీ, ఇతర సంస్థలు కూడా వీటికి సహకరించనున్నారు. వీరంతా కలసి క్రిస్మస్‌లోగా మతం వారి వివరాలు సేకరించనున్నారు.

నిఘా ఇలా..

తొలుత.. గ్రామ, పట్టణ, నగర విభాగాలుగా విభజించిన ఈ సంస్థలు, క్రిస్మస్ స్టార్లు ఉన్న ఇళ్ల ఫొటోలు తీస్తారు. తర్వాత వారి కులం, రిజర్వేషన్లు గుర్తిస్తారు. వారు అప్పటికే వేరే కులం సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారా? లేదా? అనే విషయాన్ని స్థానికంగా ఉన్న తమ కార్యకర్తల ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న ఫొటోల ఆధారంగా, వారిపై స్థానిక ఎమ్మార్వో నుంచి కలెక్టర్ల వరకూ ఫిర్యాదు చేస్తారు. ఈ మొత్తం వివరాలను జాతీయ ఎస్సీ కమిషన్‌కూ అందించి, ఇతర కులాల రిజర్వేషన్లు అనుభవిస్తూ , క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తున్నందున, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఐఏఎస్, ఐపిఎస్, ఆ తర్వాత స్థాయి ఉన్నతాధికారులు కూడా ఇదేవిధంగా మతం మారి.. ప్రతి ఏటా క్రిస్మస్, సెమీ క్రిస్మస్ వేడుకలు బహిరంగంగానే నిర్వహిస్తున్నట్లు హిందూ సంస్థల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో అలాంటి అధికారులను గుర్తించి, వారి ఇళ్లపైనా నిఘా వేయాలని హిందూ సంస్థలు నిర్ణయించాయి. ఈ తరహా అధికారులు ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరంతా దళిత సంఘాల సమావేశాల పేరుతో మత ప్రచారం నిర్విహ స్తున్నట్లు వారి సర్వేల్లో తేలింది.
‘నిజమైన క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు చేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం, ఆక్షేపణ ఉండకూడదు. అది వారి హక్కు. కానీ హిందువులుగా ఉంటూ, హిందూ సర్టిఫికెట్ల రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొంది, క్రైస్తవంలోకి మారి చర్చిలకు వెళుతున్న వారి పట్లే మా అభ్యంతరాలన్నీ. అందుకే ఈసారి ఈ పద్ధతులు అవలంబిస్తున్నాం. క్రిస్మస్ స్టార్లు, ట్రీలు, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అలాంటి మతం మారిన వారి
star3వివరాలను ఎమ్మార్వో నుంచి కలెక్టర్ స్ధాయి వరకూ ఫిర్యాదుకు చేస్తాం. ఇక ఐఏఎస్, ఐపిఎస్, ఇతర స్థాయి అధికారుల వ్యవహారాన్ని సీఎస్, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నాం’ అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు ఏ.ఎస్.సంతోష్ వివరించారు.
ఏపీలో కొందరు దళిత ఐఏఎస్,ఐపిఎస్ అధికారులు కూడా మతం మారడంతోపాటు, మతప్రచారం చేస్తున్నట్లు గుర్తించామని, వారి వివరాలను ఇప్పటికే డివోపీటీకి అందించామన్నారు. వారిపై ఇచ్చిన ఫిర్యాదులు ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్, హోంమంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా అలాంటి అధికారులపై ఫిర్యాదు చేశారని సంతోష్ గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మతమార్పిళ్లను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశామని, ఇప్పటివరకూ మతం మారి, క్రైస్తవ సంప్రదాయాలు పాటించే వారి సంఖ్యను అధికారికంగా మొదలుపెట్టామని హిందూ సంస్థలు చెబుతున్నాయి. ‘హిందువులుగా పుట్టి, హిందూ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, రుణాలు పొంది మతం మారిన వారివల్ల నిజమైన దళితులు, గిరిజనులను అన్యాయం జరుగుతోంది. వారికి చెందాల్సిన రిజర్వేషన్లు మతం మారిన వారు పొందుతున్నందున, వారిని గుర్తించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయకపోతే, ఈ సంప్రదాయం మరింత పెరుగుతుంది. ప్రధానంగా మతమార్పిళ్ల వల్ల దళిత, గిరిజనులు నష్టపోతున్నారు. దానికి అడ్డుకట్టవేసేందుకే ఈ ఏడాది నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగామ’ని ఎస్సీఎస్టీ రైట్స్ ఫోరం కన్వీనర్ కె.నాగరాజు వ్యాఖ్యానించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మతమార్పిళ్లపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోనందుకే, తాము చట్టపరమైన చర్యలకు దిగాల్సివస్తోందని హిందూ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ‘ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా మతమార్పిళ్లు జరుగుతున్నాయి. ఏపీలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ గ్రామాలకే పరిమితమైన క్రైస్తవ మతప్రచారం, ఇప్పుడు గుళ్ల దగ్గర కూడా విస్తరించింది. వాటిని మేం సహించాలా? హిందూమత సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, రిజర్వేషన్లు పొందిన వారు క్రైస్తవ మత ఆచారాలు పాటించడం, చర్చిలకు వెళ్లడం నేరం. అది రాజ్యాంగవిరుద్ధం కూడా. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చర్చి ఫాదర్లు, పాస్టర్లు, ఆర్చిబిషప్పులలో 85 శాతం మతం మారిన వారే. నిజమైన క్రైస్తవుల సంఖ్య తక్కువ. అందుకే హిందూ సర్టిఫికెట్లతో రిజర్వేషన్లు అనుభవిస్తూ, మతం మారిన వారి ఇళ్లను గుర్తించే పని ప్రారంభించాం. వారి వివరాలు ప్రభుత్వానికి అందిస్తాం. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వారి వివరాలు మేమే బహిర్గం చేస్తా’మని శివశక్తి ప్రధాన కార్యదర్శి సిహెచ్ కల్యాణ్‌కుమార్ వెల్లడించారు.

Leave a Reply