Suryaa.co.in

Andhra Pradesh

సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?

* హిందూ పురాణ పాత్రలను రాజకీయాలకు వాడుకోవాల్సిన అవసరం లేదు
* వైసీపీవి దిగజారుడు రాజకీయాలు
* దేనికి సిద్ధమో… జగన్ సమాధానం చెప్పాలి
* దేనికి సిద్ధం… మళ్లీ అబద్ధాలు, మోసాలు చేసేందుకా..?
* సభలు పేరిట పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం
* మీకు సమాధానం చెప్పేందుకు ఎన్నికల సంగ్రామంలోకి బలంగా వస్తున్నాం… సిద్ధం కండి
* జనసేన పోటీ చేసే ప్రతి స్థానం గెలవాలి … దీనికి పటిష్ట ప్రణాళిక అవసరం
* కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుంది
*మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పార్టీలో చేరిక సందర్భంగా ప్రసంగించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు

తోడబుట్టిన చెల్లి షర్మిలని నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహా భారతంలో అర్జునుడు ఎలా అవుతాడు…? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చే వాడు గాంఢీవధారి ఎలా అవుతాడు…? తండ్రి హత్య దోషులెవరో తేలాలని అలుపెరుగని న్యాయ పోరాటం చేస్తున్న మరో చెల్లి డా.సునీత కి ప్రాణ హాని ఉందని భయపెట్టేవారికి మద్దతు ఇస్తున్న వాడు సవ్యసాచి ఎలా అవుతాడు…? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

జగన్ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. మేమేదో ఆయనను ఇబ్బందిపెడుతున్నట్లు, విపక్ష నాయకులను కౌరవులతో పోలుస్తూ తాను అర్జునుడు అంటూ తనకు తానే చెప్పుకుంటున్నారన్నారు. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.. ఇక్కడ అర్జునులు ఉండరు, కృష్ణులు ఉండరు. నేను పవన్…. ఆయన జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు.

ఇష్టానుసారం హిందూ పురాణాల్లోని వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి , ఆయన కుమారుడు వల్లభనేని అనుదీప్ వైసీపీని వీడి ఆదివారం తన అనుచరులతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. శౌరి, ఆయన కుమారుడికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,. “ఓడిపోతున్నాను అనే బాధ జగన్ రెడ్డిలో కనిపిస్తోంది. ఆయన పడుతున్న వేదన వర్ణణాతీతం. తాను అర్జునుడు అంటూ ప్రజలు ఆయుధాలుగా మారాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు దోపిడీదారులో, ఎవరు అవినీతిపరులో ప్రజలకు స్పష్టంగా తెలుసు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎవరి స్వగతాలు అవసరం లేదు. నేను ఎప్పుడూ జగన్ ను తగ్గించి మాట్లాడలేదు. వ్యక్తిగత విమర్శలు చేయలేదు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వలేనివాడు, ఆమెను ఇష్టారీతిన తిట్టించేవాడు మన ఇంట్లోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ ఇస్తాడు. మన ఆడపడుచులను ఎలా కాపాడుతాడు అన్నది ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి.

వైసీపీ ఎక్కడ ఉంటే అక్కడ దిగజారుడుతనం ఉంటుంది. నన్ను ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా, నోటికొచ్చినట్లు తిట్టినా నేను స్పందించకపోవడానికి కారణం ఉంది. ఇప్పటికే రాజకీయాల పట్ల ఒక రకమైన ఏహ్యభావం యువతలో ఉంది. నేను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఒక తరానికి రాజకీయాల మీద విరక్తి, విసుగు పుడుతుంది. ఈ కారణంతోనే హుందా రాజకీయాలు చేయాలని, హుందాగా మాట్లాడాలనే నా కోపాన్ని, ఆవేశాన్ని నాలోనే దాచుకుంటాను.

దిగజారి రాజకీయాలు చేయడంలో వైసీపీ ముందుంది. గతంలో రాజకీయాలు వెగటుగా ఉన్నా కొన్ని మంచి సంప్రదాయాలు ఉండేవి. వైసీపీ వచ్చాక రాజకీయాలు దిగజారిపోయాయి. దేశంలోనే వైసీపీ దిగజారుడు రాజకీయాలు చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని వైసీపీ నాయకులు కావాలనే తీసుకొచ్చారు.

పవర్ స్టార్ అని కాదు … ప్రజా కూలీ అని పిలవండి

నన్ను పవర్ స్టార్ అని పిలిస్తే అంతగా నచ్చదు. నా ప్రమేయం ఉండే సినిమాల్లో పవర్ స్టార్ అని పేరు వేయడానికి కూడా ఇష్టపడను. దేశం కోసం పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు, పని చేస్తాడు అని ప్రజలు తమ మనసుల్లో అనుకునే దానికంటే పెద్ద బిరుదు ఏం ఉంటుంది. అందుకే నాకు సినిమాల్లో కూడా పవర్ స్టార్ అనే పదం అంతగా నచ్చదు. పవర్ స్టార్ అనే కంటే ప్రజా కూలీ అని పిలిస్తే చాలా ఆనందిస్తాను.

నాకు మొదటి నుంచి ఆశలు, భయాలు లేవు. ప్రజలకు బలంగా నిలబడాలన్న ఆకాంక్షే నడిపిస్తోంది. అడ్డదారిలో పదవులు పొందాలి అని ఏనాడు అనుకోలేదు. పార్టీని ఓ ఉన్నతమైన లక్ష్యంతో, సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తున్నాను. అలాంటి జనసేనలోకి ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులు వల్లభనేని బాలశౌరి రావడం ఆనందంగా ఉంది.

ఆయనతో పలుమార్లు చర్చలు జరిపినప్పుడు పోలవరం నిర్మాణం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు విషయంలో ఆయనకున్న విజన్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి వ్యక్తి మరోసారి జనసేన తరఫున పార్లమెంటులో తన గళాన్ని బలంగా వినిపిస్తారని ఆశిస్తున్నాను.

జగన్ అబద్ధాలకు అంతు లేదు

రాష్ట్రం అంతా సిద్ధం… సిద్ధం అంటూ పోస్టర్లతో వైసీపీ హంగామా చేస్తోంది. దేనికి సిద్ధమో? ఎందుకు సిద్ధమో? ఎవరికి అంతుపట్టడం లేదు. జగన్ చెప్పేవన్ని అబద్ధాలే. ఆయన చెప్పినన్ని అబద్ధాలు బహుశా ఎవరు చెప్పి ఉండరు. సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, మద్యనిషేధం… ఇలా చెప్పుకుంటూపోతే జగన్ అబద్ధాల లిస్టుకు అంతు అనేది ఉండదు. లక్షల మందిని కూడగట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి సభలు చేస్తున్నారు.

ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ సభలు పెడుతున్నారు. మేము కూడా ఎన్నికల సంగ్రామంలో దిగబోతున్నాం. రోజు మీకు సవాల్ విసురుతాం. మీరు జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తాం. మీరు సిద్ధంగా ఉంటే అంతులేని భయాన్ని ఇస్తాం. సిద్ధంగా ఉండండి. నేను కూడా అన్నిటికి సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చాను.

ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే చావో రేవో తేల్చుకుంటాను. రాజకీయాల్లోకి రావడం వెనుక కూడా ఒక సత్యాన్ని ఆవిష్కరించడానికి వచ్చాను. అది సాధించేపోతాను. రాజకీయ పార్టీ అనేది ఒక బలమైన భావజాలంతో కూడిన పూసల దండ. ఆ దండలో బాలశౌరి గారి లాంటి ఒక మాణిక్యం వచ్చి చేరడం ఆనందం. రాజకీయ నాయకుడు ఎన్నికల కోసం, పదవుల కోసం ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. నేను రెండో కోవకు చెందినవాడిని.

పోటీ చేసే ప్రతి సీటూ గెలవాలి

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం పార్టీల బలమైన ప్రజా ప్రభుత్వం రాబోతోంది. విజయం తేలికగా కాదు. బలమైన పోరాటం అవసరం. శత్రువు ఎన్ని మోసాలతో అయినా మళ్లీ అధికారంలోకి రావడానికి పన్నాగాలు పన్నుతాడు. జగన్ మోసాలను జయించి విజయం సాధించాలి. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో జనసేన బలమైన పాదముద్ర ఉంటుంది.

నేను సైలెంటుగా ఉన్నాను… అంతా నిస్తేజంగా ఉందని జనసైనికులు, వీర మహిళలు అనుకోవద్దు. ప్రతి మౌనం వెనుక బలమైన వ్యూహం దాగి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి చోట కచ్చితంగా గెలుపు ఉండాలనే లక్ష్యంతోనే ప్రణాళికలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసిన దగ్గర గెలిచి తీరాల్సిందే.

జగన్ దుర్మార్గం మళ్లీ వస్తే రాష్ట్రాన్ని రక్షించడం అసాధ్యం. ఐదేళ్లలోనే రాష్ట్రం పరిస్థితి ఇంత దిగజారిపోతే.. మరోసారి జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడండి. స్ధానిక సంస్ధల స్థాయి పదవులు నుంచి రాష్ట్ర స్థాయి పదవులు వరకు అందరికీ… శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఎవరినీ మరిచిపోయేది లేదు. ఎవరికీ అన్యాయం జరగదు. పడిన ప్రతీ కష్టానికీ తగిన గౌరవం ఇచ్చే బాధ్యత నాది. మరోసారి దుర్మార్గ పాలన రానీయకుండా సమష్టిగా పనిచేసి ప్రజా పాలనకు పునాదులు వేద్దాం” అన్నారు.

 

LEAVE A RESPONSE