– ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై మళ్లీ విచారించండి
– మూడునెలల్లో విచారణ ముగించండి
– హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలగింపు
– సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వు
ఢిల్లీ: మైనింగ్ డాన్ గాలి జనార్దన్రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి.. తర్వాత జగన్ ఏరికోరి తెలంగాణ సర్వీసు నుంచి తెచ్చుకున్న సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఆమెకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటను తొలగిస్తూ, సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఆమెపై విచారణను మూడునెలల్లోగా ముగించాలని ఆదేశాలివ్వడం శ్రీలక్ష్మిని ఖంగుతినిపించింది. వైఎస్ హయాంలో శ్రీలక్ష్మి ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోగా మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును, సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
2022 సంవత్సరంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ను అనుమతించి, ఆమెకు ఊరట కల్పించిన విషయం విదితమే. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా, ఆ తీర్పు ప్రభావం పడకుండా స్వతంత్రంగా ఈ విచారణ చేపట్టాలని ఆదేశించింది.తాజా సుప్రీంతీర్పుతో శ్రీలక్ష్మికి మళ్లీ చిక్కులు తప్పేలాలేవు.