Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులకే రక్షణ లేదంటే సాధారణ ప్రజల సంగతేంటి?

-పోలీసుస్టేషన్‌పై దాడి చేసినా పట్టించుకోరా?
-పేర్ని నాని, కిట్టూల దెబ్బకు పోలీసులే భయపడ్డారు
– ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం మాకు లేదు
– బుల్లెట్‌ రిపోర్ట్‌ పేరుతో తమ పార్టీపై టీవీ 9 దుష్ప్రచారం
– వారిపై కఠిన చర్యలు తీసుకుని విశ్వాసం కల్పించాలి
– కోడ్‌ ఉల్లంఘనలపై చోద్యం చూస్తున్నారు
– రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? లేరా?
– టీడీపీ సీనియర్‌ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ ధ్వజం
– తక్షణ చర్యలకు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు

విజయవాడ, మహానాడు: శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకే వైకాపా నాయకుల నుంచి రక్షణ లేకుండా పోయిందని, మచిలీపట్నంలో పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టూలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పోలీసులకే రక్షణ లేదంటే సాధారణ ప్రజల సంగతేంటి?
వర్ల రామయ్య మాట్లాడుతూ మచిలీపట్నంలో మా వారిపై ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ రాశారు అంటూ వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరూ కలిసి పోలీసు స్టేషన్‌పై దాడి చేశారని, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు అధికారులే వారి దెబ్బకు భయబ్రాంతులకు గురయ్యారన్నారు. పోలీసుస్టేషన్‌లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి విధులలో ఉన్న పోలీసు అధికా రు లను అసభ్యపదజాలంతో దూషించి హెచ్చరించారన్నారు. పోలీసు స్టేషన్‌పై దాడి చేస్తే ఇద్దరిపై కేసు నమోదు చేసి బొక్కలో తోయాల్సిందిపోయి వారిపై సెక్షన్‌ 341 కింద ఏదో చిన్న పెట్టీ కేసు నమోదు చేయటం ఏమిటని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్‌పై దాడి చేయడం చూసి పాత్రికేయులే భయపడిపోతే చింతకాయ చెట్టుకు ఆకతాయితనంగా రాయివేసినట్లు ‘మిస్‌ చీఫ్‌’ అని టుమ్రీ కేసు పెట్టారు… రేపు ఏదైనా పెద్ద లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వస్తే పోలీసులు ఏమి సమ న్యాయం చేస్తారు? అని ప్రశ్నించారు. ఇలాంటి అధికారులను చూస్తుంటే ఎన్నికలు సజావుగా సాగుతాయో లేదో అని ఆందోళనగా ఉంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిం దో డీజీపీ దగ్గర నుంచి ఫ్యాక్ట్‌ రిపోర్ట్‌ తెప్పించి ఖచ్చితంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధానాధికారి హామీ ఇచ్చారని తెలిపారు.

చంద్రబాబుపై దుష్ప్రచారమే బ్లూ మీడియా పని
పచ్చి గడ్డిని ఎండుగడ్డిలా చూపించే ఓ చానెల్‌లో చంద్రబాబు హయాంలో రోడ్లు బాగా లేవని, జగన్‌ రెడ్డి పాలనలో రోడ్డు మీద పాలు పడితే ఏరుకోవచ్చంటూ నిస్సిగ్గుగా ప్రసారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌ మోహన్‌ రెడ్డి డబ్బులతో పెయిడ్‌ ఆర్టిస్టు లు తమకిష్టమొచ్చినట్లు కూటమిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీవీ 9 చానల్‌ ప్రైమ్‌ టైమ్‌లో బుల్లెట్‌ రిపోర్టు పేరుతో పెయిడ్‌ న్యూస్‌ నడుపుతున్నారని, దానికి మీడియా కమిటీ నుంచి అనుమతి తీసువాల్సి ఉన్నా తీసుకోకుండా కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. రేట్‌ చార్ట్‌ ప్రకారం ఈ పెయిడ్‌ న్యూస్‌కు అయ్యే విలువను సంబంధిత పార్టీలకు ఖర్చు రాయాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ ఆపండని టీడీపీ కార్యకర్తలను బండ బూతులు తిడుతూ వైసీపీ కార్యకర్తలా నెల్లూరు జిల్లాలోని ఒక డీఈ వ్యవహరించారని, ఎన్నికల ప్రచారానికి తీసుకున్న అనుమతుల అకౌంట్‌ లిస్ట్‌ మొత్తం నాకు చెప్పాలని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పాలకొల్లులోని ఒక ఆర్వో ఆదేశాలిచ్చారని తెలిపారు. ఇలా ఈ అధికారి వ్యవహరిస్తున్నాడని సీఈవోకి తెలిపిన వెంటనే అతడిని మందలించమని సంబంధిత కలెక్టర్‌కు ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు.

రాష్ట్రంలో అసలు డీజీపీ ఉన్నాడా?
డీజీపీ వంటి అధికారులను పెట్టుకుంటే ఎన్నికలు సజావుగా సాగవని మేమునకుం టున్నాం. ఎన్నికల కోడ్‌ వచ్చి ఇన్ని రోజులవుతున్నా శాంతిభద్రతలు కాపాడుతా, ఎన్నికలు సజావుగా నిర్వహిస్తా, ఒక్కరు తప్పు చేసినా ఊరుకోను, పేర్ని నానిలాంటి వారు పోలీసుస్టేషన్‌లపై దాడులు చేస్తే ఉపేక్షించను అని ఏ రోజు మీడియా సమా వేశం పెట్టి ప్రజల్లో ధైర్యం డీజీపీ నింపలేదన్నారు. అసలు రాష్ట్రంలో డీజీపీ ఉన్నారో లేదో కూడా తెలియడం లేదని, ఇటువంటి ఆరోపణలు పోవాలంటే ప్రజల్లో నమ్మకాన్ని కల్పించుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కోరారు.

పెయిడ్‌ న్యూస్‌తో టీవీ 9 దుష్ప్రచారం: దేవినేని ఉమా
దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీవీ 9 చానల్‌ ప్రైమ్‌ టైమ్‌లో బుల్లెట్‌ రిపోర్టు పేరుతో పెయిడ్‌ న్యూస్‌ నడుపుతున్నారు. దానికి మీడియా కమిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా, తీసుకోకుండా కోడ్‌ను ఉల్లంఘించి దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా దురుద్దేశపూర్వక ప్రచా రం చేస్తున్నారని ఆరోపించారు. టీవీ 9 యాజమాన్యంపై ఎన్నికల కమిషన్‌ కేసును నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ కృష్ణయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌, టీడీఎల్పీ నేత కోనేరు సురేష్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌, హెచ్‌ఆర్‌సీ మెంబర్‌ ఎస్పీ సాహెబ్‌, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE