Suryaa.co.in

Telangana

మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారత దేశం

– కేసీఆర్ అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి పాలన
– రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా.. మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారత దేశం పేరు సాధించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రధాని నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ జన్మస్థలం మహూ నుంచి మొదలుకొని ఆయన పెరిగిన ప్రాంతాలను స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దారని అన్నారు. మోదీ రాజ్యాంగ బద్దంగా పాలన సాగిస్తున్నారని అన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్యారెంటీ, ఉచితల పేర్లతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని… పేదలకు శాశ్వత ప్రయోజనం కల్పించాలనే చిత్తశుద్ధి ఆ పార్టీకి లేదని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి జరుగుతోందని.. కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను బీజేపీ చేసి చూపించిందని అన్నారు. 33 శాతం మహిళ రిజ్వేషన్లు , అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కొనియాడారు.

తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మవిభూషణ్ అవార్డు వరించడంలో ఎవరి సిఫారసు లేకుండా అవార్డ్స్ కు ఎంపిక చేయడం గొప్ప విషయమని, మోదీ మార్క్ చూపించారని కొనియాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని’ లక్ష్మణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఏబీవీపీ విద్యార్థిని పట్ల పోలీసులు అనుసరించిన తీరు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను గెలిపించాలని, కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి , కాశం వెంకటేశ్వర్లు , పొంగులేటి సుధాకర్ రెడ్డి , మర్రి శశిధర్ రెడ్డి , బండా కార్తీక రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడిన ముఖ్యాంశాలు:
ప్రజలందరికీ భారత గతణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మదర్ ఆఫ్ డెమోక్రసీ.రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాజ్యాంగబద్ధంగా నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశాన్ని ప్రగతిబాటలో నడిపిస్తున్నారు.

బీఆర్ అంబేద్కర్ గౌరవార్థం ఐదు ప్రదేశాలను పంచతీర్థంగా అభివృద్ధి చేశారు. స్మృతికేంద్రాలుగా తీర్చిదిద్దారు. అంత్యోదయ సిద్ధాంతంతో సమాజంలో చిట్టచివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందేలా కృషిచేస్తున్నారు.భారతదేశాన్ని ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థికదేశంగా తీర్చిదిద్దారు.ఎన్నికల కోసం కాదు.. భావితరాల బాగుకోసం పనిచేసే నాయకుడు నరేంద్ర మోదీ .

దళారి ప్రమేయం లేకుండా పేదల సంక్షేమం కోసం, ఉపాధి కల్పించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 32 లక్షల కోట్లు పేదల అకౌంట్లలో జమ చేసింది. దళారులకు పెద్దపీట వేసి పేదల పొట్టగొట్టిన పాలన కాంగ్రెస్ ది.. ప్రతి రూపాయి పేదలకు అందేలా అకౌంట్లలో జమ చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం.4 కోట్ల పేదప్రజలకు పక్కా ఇల్లు కట్టించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే.

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోంది.ఉత్తరప్రదేశ్ లో ఏడేళ్ల కాలంలోనే 55 లక్షల మంది పేదలకు ఇండ్లు కట్టించిన ఖ్యాతి నరేంద్ర మోదీ నేతృత్వంలోని యోగి ప్రభుత్వానికి దక్కింది.ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కులవృత్తులకు ఆర్థిక చేయూత అందిస్తోంది.అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా, సంక్షేమంతో పాటు అసాధ్యం అనుకున్న అంశాలను సుసాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిదే.

ఆర్టికల్ 370 రద్దుతో భారత్ లో జమ్ముకశ్మీర్ ను అంతర్భాగం చేశారు. మహిళల సాధికారత కోసం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు.

500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత హిందువుల మనోభావాలను గౌరవిస్తూ న్యాయపరంగా చిక్కులను పరిష్కరించి అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం.

జనవరి 22న జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రపంచాన్ని అబ్బురపర్చింది.నెహ్రూ నుంచి మొదలు రాహుల్ గాంధీ వరకు 82 శాతం ఉన్న హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశాలను కాలరాస్తూ కుహనా లౌకికవాదంతో రాజకీయాలు నడిపారు.

సోమనాథ ఆలయం నిర్మాణం చేపడితే ఆనాడు నెహ్రూ తిరస్కరించారు.. నేడు అయోధ్యలో రామాలయం ప్రారంభాన్ని సోనియా గాంధీ తిరస్కరించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలే తిరస్కరిస్తారు.పేదలకు శాశ్వత ప్రయోజనం కల్పించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి దూసుకెళ్తోంది.

తెలుగు తేజాలకు పద్మ భూషణ్ ,పద్మవిభూషణ్ దక్కడంలో మోదీ మార్క్ ఉంది. ఎవరి సిఫారసులకు ఆస్కారం లేకుండా అవార్డ్స్ కు ఎంపిక చేశారు. 50రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా బీఆర్ఎస్ అడుగుజాడల్లో నడుస్తుంది. తెలంగాణ పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అయిందిఏబీవీబీ నాయకురాలు ఝాన్సీ పైన పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ ఎంపీలను గెలిపించాలి.

LEAVE A RESPONSE