Suryaa.co.in

Andhra Pradesh

జగన్ మళ్లీ రాడని నమ్మకం కలిగితేనే పరిశ్రమల రాక!

-విధ్వంసక పాలనతో పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు
-వాహనాలపై దేశంలోనే తక్కువ పన్నులు ఉండేలా చేస్తాం
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: రాష్ట్రంలో అయిదేళ్ల జగన్ విధ్వంసక పాలనతో ఎపి బ్రాండ్ దెబ్బతింది, పారిశ్రామికవేత్తలు భయాందోళనలతో ఉన్నారు, జగన్ మళ్లీ రాడని నమ్మకం కలిగితేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాయపాలెం ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మట్టి, ఇసుక, మద్యం ద్వారా లక్షలకోట్లు దోచుకున్నాడు కాబట్టే జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. మేం నిప్పులాగా బతికాం, ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక నిత్యం ప్రజల్లోని ఉంటూ వారికి జవాబుదారీగా ఉంటాం.

వైసిపి ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షమందికి ఉపాథి అవకాశాలు లభించేవి. అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తాం. మద్యపాన నిషేధం చేశాక ఓట్లు అడుగుతానన్న జగన్ జె-బ్రాండ్ల మద్యాన్ని తెచ్చి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలను తగ్గించి మద్య నియంత్రణ చేస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తదితర పన్నులతో రవాణారంగాన్నినిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనాలకు దేశం మొత్తమ్మీద అతితక్కువ పన్నులు ఉండేలా చర్యలు తీసుకుంటాం.

రాబోయే అయిదేళ్లలో పద్దతి ప్రకారం ప్రభుత్వోద్యోగాలన్నీ భర్తీచేస్తాం, పరిశ్రమలను రప్పించడం ద్వారా ప్రైవేటురంగంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అయిదేళ్లలో 30లక్షల ఇళ్లు కడతానన్న జగన్ 3వేలఇళ్లు కూడా కట్టలేకపోయారు. గత ఎన్నికలపుడు టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా వ్యవహరించాడు. గత ప్రభుత్వం 90శాతం పూర్తిచేయయగా, మిగిలిన 10శాతం పూర్తిచేసి ఇవ్వకపోవడంతో అద్దెలు వడ్డీభారంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో గృహసముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు అందజేస్తాం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ శవరాజకీయాలు చేయడం జగన్ కు అలవాటుగా మారింది. 2014లో తండ్రిశవం, 2019లో బాబాయి శవంతో రాజకీయం చేశాడు. ఈసారి పెన్షన్లు ఇవ్వకుండా 32మంది వృద్ధులను చంపేసి వారి శవాలతో రాజకీయం చేయాలని ప్రయత్నించాడు. ఏంచేసినా ఇక ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్ పనైపోయింది, ఆయన శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కావడం ఖాయమని లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE