వివేకా హత్య కేసులో సాక్షులకు 1+1 భద్రత సరిపోతుందా?

– సుప్రీంకోర్టు

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్‌ బయట చేపట్టాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న సాక్షులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సాక్షులకు 1+1 భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

వాదనలు విన్న ధర్మాసనం..”సాక్షులకు 1+1 భద్రత సరిపోతుందా? కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా?కేసు దర్యాప్తు ఏ విధంగా ముందుకు పోతుందో తెలుస్తోంది. కేసులోని తీవ్ర ఆరోపణల మేరకు వ్యవహరిస్తున్నారా?” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఒకట్రెండు రోజులు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ కూడా గడువు కోరింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 19న వింటామని పేర్కొంటూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Leave a Reply