బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బజారు రౌడీల్లా వ్యవహరించటం సిగ్గుచేటు

– ప్రశ్నించివారిపై దాడులు చేయమని వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి చెప్పారా?
– మాజీ మంత్రి కె.య.స్ జవహర్

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ‎వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బజారు రౌడీల్లా వ్యవహరించటం సిగ్గుచేటు. అభివృద్దిని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడడం, బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టి వేధించటం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పరిపాటిగా మారింది.

ప.గో జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగు యువత నాయకుడు పోలోతు అంజిపై ఎస్సై సాగర్ ‎దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ది పనులపై ఎమ్మెల్యే ఎలిజాను

ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడి చేయించటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కుంది, చేతనైతే సమాధానం చెప్పాలి తప్ప, బూతులు తిట్టడం, దాడులు చేయటం ఏంటి?

ఇది జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనం. వైసీపీ పాలనంతా అప్పులు, తప్పులు ప్రజలపై దాడులు దౌర్జన్యాలు తప్ప అభివృద్ది శూన్యం. జగన్ రెడ్డి 3 ఏళ్లలో రాష్ట్రంలో ఏం అభివృధ్ది చేయలేదు కాబట్టే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వినుకొండలో రైతు సమస్యలపై ప్రశ్నించిన వ్యక్తిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించడమే కాక తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. వీటన్నిటికి కారణం జగన్ రెడ్డే.

వైసీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే ‎వారు రెచ్చిపోతున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార మదంతో హధ్దు మీరు ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అంజిపై దాడి చేసి అవమానించిన ఎస్సై సాగర్ పై , దాడికి ప్రోత్సహించిన ఎమ్మెల్యే ఎలీజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

Leave a Reply