రుషికొండను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు

– ప్రభుత్వ స్థలంలో టూరిజం శాఖ భవనాలు కడుతుంటే ఎందుకు కడుపు మంట?
– రుషికొండ వెళ్ళి సీపీఐ నారాయణ అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతాడు..!?
– సీపీఐ= చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్‌ ఇండియాగా మారింది
– విశాఖలో ఏ నిర్మాణం జరుగుతున్నా అడ్డుకోవడమే ప్రతిపక్షాల పని
– రామానాయుడు స్టూడియో, ఐటీ సెజ్ లు కొండలపై కట్టలేదా..?
– లోకేష్‌ పాక్కుంటూ యాత్ర చేసినా అధికారంలోకి రావడం కల్లే
– రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌

రుషికొండ అనేది ఒక పర్యాటక ప్రదేశం. అక్కడకు ఎవరైనా రావొచ్చు.. వెళ్లొచ్చు. బహుశా నారాయణ గారు కూడా పర్యాటక శాఖ రుషికొండపై చేపట్టిన భవనాల పనులను పరిశీంచడానికి వెళ్లి ఉంటారు. మేము కూడా మొదట్నించీ ఎవరైనా చూడొచ్చు అనే చెప్తున్నాం. ప్రభుత్వ స్థలంలో టూరిజం శాఖ భవనాలు నిర్మిస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం విడ్డూరం. దయచేసి ప్రతిపక్షాలు.. ప్రతి అంశాన్నీ రాజకీయాలకు వాడుకోవద్దు. విశాఖపట్నంలో ఏ నిర్మాణం జరిగినా దానికి అడ్డుకట్ట వేయాలనేది ప్రతిపక్షాల ప్రయత్నం.

సీపీఐ అనేది ఎప్పుడో చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్‌ ఇండియాగా మారిపోయింది. ఆ నాయకులు అక్కడకు వెళ్ళి అంతకంటే గొప్పగా మాట్లాడతారని మేము అనుకోవడం లేదు. వారు చేస్తున్నది కేవలం రాజకీయం మాత్రమే. రుషికొండపై గతంలో అనేక నిర్మాణాలు జరిగాయి. రామానాయుడు స్టూడియో, ఐటీ సెజ్‌ కొండలపైనే నిర్మాణాలు జరిగాయి. టూరిజం శాఖ.. ఒక భవనాన్ని రుషికొండపై నిర్మాణం చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపుమంట?.

లోకేష్ పాక్కుంటూ యాత్ర చేసినా ఫలితం ఉండదు
లోకేష్‌ 4 వేల కిలో మీటర్లు కాదు.. 40 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా మాకేమీ నష్టం లేదు. కనీసం మంగళగిరిలో కూడా గెలవలేని వ్యక్తి, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానంటున్నాడు. లోకేష్, పాదయాత్ర కాదు.. పాక్కుంటూ యాత్ర చేసినా అధికారంలోకి రావడం కల్లే… అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Leave a Reply