Suryaa.co.in

Andhra Pradesh

జగన్ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారినే అణగదొక్కుతున్నారు

– ఎర్రగొండపాలెం సీఐ, ఎస్ఐల కబంద హస్తాల్లో చిక్కుకొని చనిపోయిన మోజెస్ కు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
-చనిపోయిన వ్యక్తి బ్రతికున్నా అంతకంటే ఎక్కువ సంపాదించలేడని చెప్పడం చాలా ఘోరమైన విషయం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఎర్రగొండపాలెం సీఐ, ఎస్ఐల కబంద హస్తాల్లో చిక్కుకొని చనిపోయిన మోజెస్ కు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు…

జగన్ ప్రభుత్వం దళితుల శవాలతో బేరసారాలు చేయడం అత్యంత బాధాకరం
జగన్ ప్రభుత్వం దళితుల శవాలతో బేరసారాలు చేయడం అత్యంత బాధాకరం. దళితుల శవాలను పక్కన పెట్టుకొని బేరసారాలు, సెటిల్ మెంట్ లు చేస్తున్న కొందరు మంత్రులు చనిపోయిన వ్యక్తి బ్రతికున్నా అంతకంటే ఎక్కువ సంపాదించలేడని చెప్పడం చాలా ఘోరమైన విషయం. జగన్ పాలనలో దళితుల శవాలకు ధర కట్టడం.. ఇదెక్కడి న్యాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో మోజెస్ అనే దళితుడు ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పిన ఎస్ఐ, సీఐలను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.

ఎర్రగొండపాలెం మాదిగ యువకుడు మోజేస్ మరణం వెనుక దాగి ఉన్న నిజాన్ని ప్రభుత్వం నిగ్గుతేల్చాలి. అతని మరణంలో నిజా నిజాలు తేలాలంటే వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలి. పోలీసులు, వైసీపీ నాయకులు దళితులను చంపుతుంటారు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సెటిల్ మెంట్ లు చేస్తుంటారు.. ఇలావుంది రాష్ట్ర దుస్థితి, దళితుల పరిస్థితి.నా దళితులు అని చెప్పుకునే జగన్ మోజెస్ మృతిపై నేటికీ ఎందుకు స్పందించలేదు? దళితులపై ప్రేమ కేవలం మాటల్లోనేనా? ఆచరణలో మాత్రం శూన్యం. ముఖ్యమంత్రి దళితుల మరణాల పట్ల ఏరోజు కూడా ఒక్క సమీక్ష చేయలేదు. ఇప్పటికైనా దళితుల దాడులపై సమీక్షించాల్సిన అవసరముంది.

మోజెస్ శవానికి ధర కట్టిన మంత్రిని బర్తరఫ్ చేయాలి
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాల్సిన మంత్రి ఆదిమూలపు సురేష్ ‘‘ఏదో ఇస్తున్నారు కదా తీసుకొని వెళ్లిపొండి’’ అనడం ఎంత దుర్మార్గం. దళిత కులానికి చెందిన వ్యక్తిగా ఉండి దళితుడి పట్ల ఇలా మాట్లాడటానికి మనసెలా ఒప్పింది? మోజెస్ శవానికి ధర కట్టిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక్క క్షణం కూడా దళిత మంత్రిగా కొనసాగే హక్కు లేదు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. దళితులు నా మేనమామలని జగన్ చెబుతూనే వారిపై దమనకాండకు పాల్పడుతున్నారు.

ఆయన మేనమామ కాదు దళితుల పట్ల కంసమామ. దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ కు వారిపట్ల ఏమాత్రం కృతజ్ఞతా భావం లేదు. దళితుల అభివృద్దికి మోకాలడ్డిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైంది. దళితులను చంపి ఆ విషయాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు బాధిత కుటుంబాలతో బేరాలాడడం వారికి సర్వసమాన్యమైపోయింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల ప్రాణాలకు వెలకడుతూ వారి పట్ల చిన్నచూపు చూస్తోంది.

పోలీసులు, వైసీపీ నాయకులు దళితులను చంపడం… జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సెటిల్ మెంట్ లు చేయడం ఆనవాయితీగా మారింది. వైసీపీ ప్రభుత్వం 185 మంది దళితులను పొట్టన పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం. జగన్ మానసికంగా దళిత వ్యతిరేకి.

దక్షిణాది రాష్ట్రాల్లో దళితులపై దాడుల్లో ఏపీ 10వ స్థానం
దక్షిణాది రాష్ట్రాల్లో దళితులపై దాడుల్లో ఏపీ 10వ స్థానంలో ఉండడం దౌర్భాగ్యం. దళిత జాతికి జగన్ ఏం సందేశమివ్వాలనుకున్నారు? దళితల పట్ల జగన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎన్ సీ ఆర్ బీ రిపోర్టు ప్రకారం వారానికి నలుగురు దళితులు హత్యకాబడుతున్నారు. తెలుగుదేశం హయాంలో దళితులను తమ కాళ్ల మీద తాము నిలబడగలిగేలా చేశారు. భూ పంపిణీ పథకం కింద వేలాదిమందికి భూమిని పంపిణీ చేసి వారిని భూస్వాములు చేశారు. వైసీపీ పాలనలో ఒక్క ఎకరమైనా దళితులకు ఇచ్చారా?

టీడీపీ హయాంలో అనేక దళితులకు ఇన్నోవా కార్లకు యజమానులు చేశారు. వైసీపీ పాలనలో ఒక్క దళితుడికైనా ఒక్క ఇన్నోవా కారు ఇచ్చారా? ఒక్క దళితుడినైనా విదేశాలకు పంపించి చదివించగలిగారా? దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. దళిత సంక్షేమం అంటే ఇదేనా? దళితులపట్ల ప్రేమ ఉంటే ఇలా చేస్తారా? వీటన్నింటిని బట్టి జగన్ దళిత వ్యతిరేకి అని చెప్పకనే చెప్పొచ్చు. ఏ తప్పు చేయని మోజెస్ పోలీసుల వల్లే చనిపోయాడు, వారే కారణం బాధ్యత ప్రభుత్వానిదే. కనుక 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE