Suryaa.co.in

Andhra Pradesh

ప్రచార ఆర్భాటం, దుష్ప్రచారం తప్ప నాలుగేళ్లలో విద్యారంగం బలోపేతానికి జగన్ రెడ్డి చేసింది శూన్యం

• తప్పుడు నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో జగన్ రెడ్డి విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడు
• ఫీజు రీయింబర్స్ మెంట్, అమ్మఒడి చెల్లింపులతో విద్యారంగం బాగుపడితే, విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణతా శాతం ఎందుకు తగ్గాయో ముఖ్యమంత్రి చెప్పాలి
• ఫీజు రీయింబర్స్ మెంట్ , అమ్మఒడి చెల్లింపుల్లో ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప, క్షేత్రస్థాయిలో ఫలితాలు అధ్వాన్నం
• అబద్ధాలతో దుష్ప్రచారం చేయడం మాని, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులపై వాస్తవ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ప్రభుత్వాలు ఎంత మాయచేస్తాయో, ప్రజల్ని ఎలా మోసగిస్తాయో చెప్పడానికి జగన్ రెడ్డే నిదర్శనమని, వైసీపీ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నాశనమైనంతగా బహుశా మరే వ్యవస్థ అవ్వలేదని, ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము తల్లులకు ఇస్తున్నాననడం అంతా మాయేనని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ ఆర్థిక ఇబ్బందులు, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గతంలో టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఆర్థిక సాయం అందించింది. మొత్తం బడ్జెట్లో 1.43 శాతం నిధులు ఈ పథకం కోసం వెచ్చించింది. బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర ఆదాయం, అప్పులు అన్నీ పెరిగినా, బడ్జెట్లో ఫీజు రీయింబర్స్ మెంట్ కు జగన్ రెడ్డి ఖర్చుపెట్టింది కేవలం 0.93శాతం నిధులు మాత్రమే. కేటాయింపులు తగ్గిం చడంతో పాటు విద్యార్థుల సంఖ్యను కూడా వైసీపీప్రభుత్వం తగ్గించింది.

కేవలం 9.8 లక్షల మందికే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తోంది. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా ఇతర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందుతుంది. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముని సంవత్సరంలో ఒకేసారి నేరుగా విద్యాసంస్థలకు చెల్లించింది. దాంతో విద్యార్థులు నేరుగా విద్యాభ్యాసంపై దృష్టి పెట్టి, శ్రద్ధతో చదువడంతో మంచి ఫలితాలు వచ్చాయి.

తల్లులఖాతాల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము వేయడం.. విడతలవారీ చెల్లింపులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు
జగన్ రెడ్డి హాయాంలో అందుకు భిన్నంగా ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ముని తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వేయడం ప్రారంభించారు. ప్రభుత్వం తల్లులకు డబ్బులిస్తే, వారు విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పరిస్థితి. వైసీపీప్రభుత్వం ఒకేసారి చెల్లించాల్సిన సొమ్ముని సంవత్సరంలో నాలుగు సార్లుగా ఇస్తోంది. ఏడాదికి నాలుగుసార్లు సక్రమంగా ఇస్తున్నారా అంటే.. అదీలేదు. 2019-20లో వైసీపీప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు వివరాలు బయటపెట్టాలి.

2020-21లో నాలుగు వాయిదాలకు ఒక వాయిదా ఎగ్గొట్టారు. 2023-24 విద్యాసంవత్సరం ముగుస్తున్న తరుణంలో తొలి విడత చెల్లించారు. తల్లులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఇవ్వడం వల్ల పిల్లల ఫీజుల్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. 80శాతం మంది తల్లులు ప్రభుత్వమిచ్చిన సొమ్ముని ఇచ్చినట్టే విద్యాసంస్థలకు చెల్లించలేకపోతున్నారు.

దాంతో విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తం ఫీజులు కట్టేవరకు విద్యార్థు లకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. తల్లులకు డబ్బులిచ్చాం.. అంతా ఇచ్చాము.. ఇంత ఇచ్చామని పత్రికల్లో, ప్రసారమా ధ్యమా ల్లో ప్రకటనలు ఇవ్వడం తప్ప, క్షేత్రస్థాయిలో దానివల్ల విద్యార్థులకు నష్టమే జరుగుతోంది.

ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లిస్తే, విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణతా శాతం ఎందుకు తగ్గిందో ముఖ్యమంత్రి చెప్పాలి
కేవలం విద్యాసంస్థల్ని, విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడానికే జగన్ రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును విడతలవారీగా చెల్లిస్తున్నాడు. అనేక నిబంధనలతో ఏటికేడు విద్యార్థుల సంఖ్యలో కోతపెడుతున్నాడు. తొలుత 11 లక్షల మందికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చిన జగన్ రెడ్డి సర్కార్, ఆ సంఖ్యను ఇప్పుడు 9.8లక్షలకు కుదించింది. విద్యుత్ ఛార్జీలు, నాలుగు చక్రాల వాహనం, ఇంటి విస్తీర్ణం ఎక్కువ ఉందనే అర్థంపర్థం లేని నిబంధనలతో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుల్లో జరిగే అనర్థాలతో ప్రతి ఏటా విద్యనభ్యసించే విద్యార్థులు సంఖ్య తో పాటు, నాణ్యమైన విద్యాబోధన, ఉత్తీర్ణతాశాతం తగ్గుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇంటర్ ఉత్తీర్ణతా శాతం 74శాతం పైనే ఉంది. ఈ ప్రభుత్వంలో అది 2021-22లో అది 62 శాతానికే పరిమితమైంది. పత్రికల్లో, ప్రచార సభల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులపై ఊదరగొడుతున్న ప్రభుత్వం, ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై ఏం సమాధానం చెబుతుంది?

ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులకు సంబంధించి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. నాలుగేళ్లలో ఎందరు తల్లులఖాతాల్లో ఎంత సొమ్ము, ఎన్ని విడతల్లో ఇచ్చాడో జగన్ రెడ్డి చెప్పాలి.

జీవో నెం-77తో పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టాడు. జాతీయ విద్యా విధానం పేరుతో 7 లక్షలమందిని ప్రాథమిక విద్యకు దూరం చేశాడు
రాష్ట్రంలో మంచి కళాశాలల్లో ఇంజనీరింగ్ సీట్లు రావన్న ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు తెలంగాణ, తమిళనాడుకు వెళ్లిపోయారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తల్లుల కు ఇస్తున్న ప్రభుత్వవిధానంతో యాజమాన్యాలు విద్యాసంస్థల్ని నిర్వహించలేని స్థితికి వచ్చాయి. అలానే జీవోనెం-77తో జగన్ రెడ్డి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. సదరు జీవోతో ఎయిడెడ్ కళాశాలల్లో పీజీ చదివే వారికే ఫీజు రీయింబర్స్ మెంట్ రాకుండా పోయింది.

అలానే జాతీయ విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల్ని తీసేయడంతో దాదాపు 7 లక్షల డ్రాపవుట్స్ పెరిగాయి. ఇలాంటి నిర్ణయాలతో విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన జగన్ రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ కు తమ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పాడు. టీడీపీప్రభుత్వంతో పోలిస్తే, నిధుల కేటాయింపు ఈ ప్రభుత్వంలో తగ్గినా జగన్ నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాడు.

ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము తల్లులకు ఇచ్చినట్టే, ఆరోగ్య శ్రీ సాయాన్ని నేరుగా పేదలకు ఇచ్చే ధైర్యం ముఖ్యమంత్రి చేయగలడా? విద్యావిధానంలో ఒకలా… ఆరోగ్యశ్రీలో మరోలా వ్యవహరించడం జగన్ రెడ్డి ద్వందనీతికి నిదర్శనం. ప్రజల్ని మోసగించడానికే జగన్ ఇలాంటి విధానాలు అనుసరిస్తున్నాడు.

నాలుగేళ్లలో విద్యారంగ పరిపుష్టికి జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు
జాతీయ విద్యావిధానం నిబంధనలను దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయకపోయినా వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తోంది. కేవలం ఎఫ్.ఆర్.బీ.ఎం అప్పులపరిమితి పెంచుకో వడానికే జగన్ రెడ్డి జాతీయ విద్యావిధానం అమలుకు సిద్ధమయ్యాడు. టీడీపీప్రభు త్వం సమర్థవంతంగా అమలుచేసిన విదేశీవిద్య పథకాన్ని జగన్ రెడ్డి కొంగకు పళ్లెంలో పెట్టిన విధంగా నీరుగార్చాడు.

విద్యారంగం పరిపుష్టికి నాలుగేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోని జగన్ రెడ్డి, వేలకోట్ల నిధులు కేటాయించానని చెప్పడం కేవలం ప్రచార ఆర్భా టమే. వందలకోట్ల ప్రజల సొమ్ము ప్రచారానికి దుర్వినియోగం చేస్తూ, దుష్ప్రచారంతో ప్రజల్ని వంచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్కడే. గత ప్రభుత్వాల బకాయి లు తరువాత వచ్చే ప్రభుత్వాలు చెల్లించడం ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీనే. జగన్ రెడ్డి చేస్తున్న మోసాలు, దుష్ప్రచారాన్ని ప్రజలు గ్రహించారు.” అని అశోక్ బాబు చెప్పారు.

LEAVE A RESPONSE