Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల…ఇతర అమానుషఘటనల్లో జగన్ రెడ్డే ఏ-1 ముద్దాయి

– దళితులపై..వారి ఉనికిపై.. వారి విద్య..ఉపాధి.. ఉద్యోగాలపై.. దాడిచేస్తున్న జగన్ రెడ్డికి.. అతని ప్రభుత్వానికి సామాజిక సాధికార యాత్ర చేసే హక్కు లేదు
• బాధితులైన ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్న ఈ ముఖ్యమంత్రికి నా ఎస్సీలు అనే అర్హత లేదు
• దళితులే ధ్యేయంగా.. బలహీనవర్గాలే లక్ష్యంగా రెడ్డి సామాజికవర్గం రాష్ట్రంలో పేట్రేగిపోతోంది
• ఆ వర్గానికి అంత బరితెగింపు ఎక్కడినుంచి వస్తోంది అంటే పాలకులుగా తమవారు ఉన్నారన్న ధైర్యంనుంచే
• అధికారంలో మేమున్నాం ..మమల్ని ఎవరు ఏంచేస్తారని అనగలిగే ధైర్యం.. పరిపాలనలో ఉన్న వారు అండగా ఉన్నారన్న గట్టి నమ్మకం వల్లే వస్తుంది
• దళితులపై రాష్ట్రంలో తొలిదాడి జరిగినప్పుడే ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరిస్తే….నేడు శ్యామ్ కుమార్ పై.. రాష్ట్రంలో దళితులపై 6వేల దాడులు..28 హత్యలు.. జరిగేవి కావు
• జగన్ రెడ్డి…అతని సామాజికవర్గంతో నిత్యం అవమానింపబడుతూ.. సిగ్గులేకుండా దళిత మంత్రులు సామాజికసాధికార బస్సుయాత్రలో ఎలా పాల్గొంటున్నారు?
– మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్

నా ఎస్సీలు.. నా ఎస్టీలు…నా బీసీలు.. నా మైనారిటీలు అన్న జగన్ రెడ్డి మాటలకు, క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలపై జరుగుతున్న దారుణాలకు ఎక్కడా పొంతనలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులకు సంబంధించి జగనే ఏ-1 ముద్దాయి అని, తన ప్రభుత్వంలో దళితులపై 6 వేలకు పైగా దాడులు ఎందుకు జరిగాయో, వాటికి పాల్పడిన వారిని ఎందుకు శిక్షించలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని టీడీపీ నేత, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ దళితులపై జగన్ ప్రభుత్వంలో జరిగిన..జరుగుతున్న దాడులు.. ఇతర అమానుష ఘటనల వెనుక ప్రధానంగా ఉంటున్నది రెడ్డి సామాజికవర్గమే. ఆ వర్గం ప్రమేయం లేకుండా..వారి పాత్ర లేకుండా దళితులపై దాడులు జరుగు తున్నాయంటే ఎవరూ నమ్మరు. ఇప్పటివరకు జరిగిన కొన్ని ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో శ్యామ్ కుమార్ అనే దళిత యువకుడిపై దాడిచేసి .. కంచికచర్ల నుంచి గుంటూరు వరకు అతని వెంటపడి.. వేధించి..విచక్షణా రహితంగా దాడికి పాల్పడి, చివరకు అతనిపై మూత్రంపోసే స్థాయికి బరి తెగించారు. శ్యామ్ కుమార్ పై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు హర్షవర్థర్ రెడ్డి. దాడి చేశాక హర్షవర్థన్ రెడ్డి తమను ఎవడూ ఏమీ చేయలేడని అహంకారంతో విర్రవీగాడంటే దానికి కారణం ఎవరు? గతంలో సీతానగరం ఘాట్ వద్ద ప్రేమజంటపై దాడికి పాల్పడి…యువతిపై వెంకటరెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాడికొండి నియోజకరవర్గం కంతేరులో దళిత యువకులపై దాడికి పాల్పడింది హరికృష్ణారెడ్డి. కావలిలో దళితయువకుడు కరుణాకర్ పై దాడిచేసింది కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి.. సురేశ్ రెడ్డిలు. నిందితులకు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అండగా నిలిచాడు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోని సింహాద్రిపురం సమీపంలోని అంకాళ్లమ్మగూడూరులో దళితుడు జంధ్యాలకృష్ణయ్యను ఉత్తమ్ రెడ్డి కిరాతకంగా హత్యచేశాడు. పులివెందులలో దళిత మహిళ నాగమ్మను హత్యాచారంతో బలితీసుకున్నారు. పల్నాడుజిల్లా నకరికల్లులో ఎస్టీ మహిళ మంత్రూబాయిని, శ్రీనివాసరెడ్డి అత్యంత దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు. ఒంగోలులో దళితుడిపై మూత్రం పోశారు. పల్నాడులో దళిత కుటుంబాలే లక్ష్యంగా జరిగిన దాడులు అనేకం. వందలాది దళిత కుటంబాలను ఆ ప్రాంతం నుంచి బహిష్కరించారు.

ఇలా దళితులే ధ్యేయంగా.. బలహీనవర్గాలే లక్ష్యంగా రెడ్డి సామాజికవర్గం రాష్ట్రంలో పేట్రేగిపోతోంది. వారికి అంత బరితెగింపు ఎక్కడినుంచి వస్తోంది అంటే పాలకులుగా తమవారు ఉన్నారన్న ధైర్యంనుంచే. అధికారంలో మేమున్నాం ..మమల్ని ఎవరు ఏంచేస్తారని అనగలిగే ధైర్యం.. పరిపాలనలో ఉన్న వారు అండగా ఉన్నారన్న గట్టి నమ్మకం వల్లే వస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు…హత్యలు.. ఇతర అమానుష ఘటనల్లో ముమ్మాటికీ ముఖ్యమంత్రే ఏ-1 ముద్దాయి
కిందిస్థాయిలో ఉన్న జగన్ వర్గీయులు చేసే దాడులు ఒకెత్తు అయితే.. పైస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ముఖ్యమంత్రే దళితసమాజంపై ఏదో కక్షకట్టినట్టు పరోక్షంగా.. ప్రత్యక్షంగా దాడులు.. హత్యలు… అవమానాలకు పాల్పడటం.

డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగినందుకు పిచ్చివాడిని చేసి చంపేసింది ఈప్రభుత్వం కాదా? డాక్టర్ అచ్చెన్నను కులంపేరుతో దూషించి..అతని చావుకు కారణమైంది జగన్ సర్కార్ కాదా? ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించాడని వరప్రసాద్ కు శిరోముం డనం చేశారు. మాస్కులు పెట్టుకోలేదని కిరణ్ కుమార్ అనే యువకుడని చీరాలలో కొట్టి చంపారు.

కల్తీమద్యం.. అధికధరలపై ప్రశ్నించాడని వైసీపీ నేతలు ఓంప్రతాప్ అనే దళిత యువకుడిని బలితీసుకున్నారు. పల్నాడులో విక్రమ్ కుమార్ అనే దళిత యువకుడిని పాశవికంగా హతమార్చారు. దళిత జడ్జీ రామకృష్ణ జగన్ సామాజికవర్గం మాట వినలేదని ఆయన్ని..ఆయన తమ్ముడిని వేధించి, తప్పుడు కేసులతో వారిని హింసించింది మంత్రి పెద్దిరెడ్డి.. అతని తమ్ముడు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి, అతని శవాన్ని అతని ఇంటివద్దే పడేసినా ముఖ్యమంత్రి స్పందించలేదు. పైగా అనంతబాబు భుజాలపై చేతు లేసి మరీ జగన్ రెడ్డి అతన్ని అక్కున చేర్చుకుంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు…హత్యలు.. ఇతర అమానుష ఘటనల్లో ముఖ్యమంత్రే ముమ్మాటికీ ఏ-1 ముద్దాయే.

దళితులకోసం చంద్రబాబు అమలుచేసిన 27పథకాలు రద్దచేసిన జగన్ రెడ్డి.. మంత్రులు ఏ ముఖం పెట్టుకొని సామాజిక సాధికార బస్సుయాత్రలో దళితుల జపం చేస్తున్నారు?
దళితులే లక్ష్యంగా జరుపుతున్న దాడులు..ఇతర ఘటనలు ఒకెత్తు అయితే, వారికి సంబంధించిన భూములు లాక్కోవడం.. వారికి దక్కాల్సిన నిధుల్ని కాజేయడం.. వారి పథకాలు రద్దుచేయడం మరో ఎత్తు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా టీడీపీప్రభుత్వం 4 లక్షలమంది దళితులకు ఉపాధి కల్పిస్తే, ఆ కార్పొరేషన్ నే జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు . దళితజాతి ఆరాధ్యదైవమైన డాక్టర్ అంబేద్కర్ పేరుతో గతప్రభుత్వం తీసుకొచ్చిన అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని రద్దుచేసిన జగన్.. ఆ పథకానికి తన పేరు పెట్టుకున్నాడు.

దళితబిడ్డలకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించడంకోసం చంద్రబాబు ఏర్పాటుచేసిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను జగన్ తీసేశాడు. దానిపై కొందరు దళితులు , ప్రజాసంఘాలు కోర్టుల్నిఆశ్రయిస్తే… హైకోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలిస్తే.. దానిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి భంగపడింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పినా వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేదు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలు పెట్టిన తొలి ఏడాదిలోనే సబ్సిడీ నిధులు అందిస్తే.. జగన్ రెడ్డి రెండేళ్లపాటు ఆ నిధుల ఊసే ఎత్తలేదు.

చంద్రబాబు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు ఇన్నోవాకార్లు.. ప్రొక్లెయిన్స్.. ట్రాక్టర్లు అందిస్తే జగన్ రెడ్డి ఆ పథకాన్నే రద్దుచేశాడు. దళిత యువత ఉన్నతవిద్య చదవకూడదని వారికి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు లేకుండా చేశాడు. 50 వేల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీని జగన్ పట్టించుకోవడం లేదు. ఇలా దాదాపు దళితులకోసం చంద్రబాబు అమలుచేసిన 27పథకాలు రద్దచేసిన జగన్ రెడ్డి.. మంత్రులు ఏ ముఖం పెట్టుకొని సామాజిక సాధికార బస్సుయాత్రలో దళితుల జపం చేస్తున్నారు.

దళితుల పథకాలు రద్దుచేసి.. వారి భూములు లాక్కుంటూ..వారినే తప్పుడు కేసులతో వేధిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ఎలా తమకు ఇష్డుడు దళితమంత్రులు చెప్పాలి
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తన నియోజకవర్గంలో దళిత డాక్టర్ అనితారాణిని వైసీపీనేతలు వేధిస్తే ఆయన స్పందించలేదు. కోడికత్తి కేసులో జగన్ రెడ్డి ఆడిన రాజకీయ వికృత క్రీడలో అన్యాయంగా బలైపోయిన దళితయువకుడు శ్రీనివాస్ జైల్లో మగ్గిపోతున్నాడు. కోడికత్తిని శ్రీనివాస్ కు అందించింది మంత్రి బొత్స బంధువని తేలినా ముఖ్యమంత్రిగానీ.. ప్రభుత్వంగానీ దానిపై స్పందించలేదు. దళితజాతి వినాశ నమే లక్ష్యంగా అనేక దారుణాలకు పాల్పడిన ఈ ముఖ్యమంత్రి..అతని ప్రభుత్వం సిగ్గులేకుండా ఏ ముఖం పెట్టుకొని నాఎస్సీలు..నాఎస్టీలు అంటోంది?

ప్రభుత్వంలోని ఎస్సీలపై జరుగుతున్న అవమానాలు.. వేధింపులు సాటి దళిత మంత్రులుకు కనిపిం చడం లేదా? ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఈప్రభుత్వ బాధితుడిని అని అనడం దేనికి సంకేతం? ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సిగ్గులేకుండా తన చర్మం వలిచి జగన్ కు చెప్పులు కుట్టిస్తాననడాన్ని ఏమనాలి? అత్యున్నత వేదికపై తనకు కుర్చీ లేకపోయినా ఆయనకు దళితుల గౌరవం గుర్తుకు రాదు. దళితుల పథకాలు రద్దుచేసి వారిపైనే దాడులు చేయిస్తున్న జగన్ తనకు ఎలా ఇష్టుడు అయ్యాడో మేరుగ నాగార్జున చెప్పాలి.

శ్యామ్ కుమార్ పై జరిగిన దాడిపై దళితమంత్రులు ఎందుకు స్పందించలేదు. ఎవరికళ్లల్లో ఆనందంకోసం దళితమంత్రులు సామాజికసాధికార యాత్రలో పాల్గొంటున్నారో సమాధానం చెప్పాలి. దళితులపై రాష్ట్రంలో తొలిసారి దాడి జరిగినప్పుడే ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించి ఉంటే….నేడు శ్యామ్ కుమార్ పై దాడిజరేగిది కాదు. రాష్ట్రంలో దళితులపై 6వేల దాడులు..28 హత్యలు.. జరిగేవి కావు.” అని శ్రావణ్ కుమార్ తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE