Suryaa.co.in

Andhra Pradesh

తన పాలనలో జగన్ రెడ్డి ప్రజలకు అందించి సంక్షేమం గోరంత.. వారి నుంచి కొట్టేసింది కొండంత

• సామాజిక పింఛన్లు రూ.3వేలకు పెంచుతానన్న హామీని జగన్ నెరవేర్చకపోవడంతో ప్రతి పింఛన్ దారుడు రూ.18 వేలు నష్టపోయాడు
• అమ్మఒడి సాయం సక్రమంగా అందించకపోవడంతో ప్రతి తల్లి రూ.75వేలు కోల్పోయింది
• చేయూత, అమ్మఒడి, కాపునేస్తం, విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇలా అన్నిపథకాల్లో అర్హులకు, ఆర్థికసాయానికి కోతపెట్టాడు
• తన పాలనలో అమ్మఒడి, చేయూత, కాపునేస్తం, సామాజిక పింఛన్లలో కోతలు పెట్టిన సొమ్ము మొత్తం చెల్లించాకే జగన్ ఓట్లు అడగాలి
• పింఛన్లు, అమ్మఒడి, చేయూత, కాపునేస్తం కింద ఎంతమందికి, ఎంత సొమ్ము చెల్లించాడో తెలియచేస్తూ జగన్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

ఎన్నికలకు ముందు పాదయాత్రలోగానీ, ఎన్నికల సమయంలో గానీ జగన్ రెడ్డి ప్రజలకు 1700 వరకు అలవికానీ హామీలు ఇచ్చాడని, తన 57 నెలల పాలనలో వాటిలో 10శాతం కూడా నెరవేర్చలేదని, వాటిలో ప్రధానమైంది సామాజిక పింఛ న్ల పెంపు అని అధికారంలోకి వచ్చిన వెంటనే రూ3.వేలు ఇస్తానన్న జగన్ రెడ్డి, అధికారం కోల్పోయే చివరిరోజుల్లో రూ.3వేలు ఇవ్వడం అవ్వాతాతల్ని వంచించడం కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ పింఛన్లు ఇస్తానని, చంద్రబాబు ఇచ్చే దానికంటే ఎక్కువగా 1000రూపాయలు కలిపి రూ.3వేలు ఇస్తానని నమ్మబలికా డు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక ముక్కిమూలిగి విడతలవారీగా ఇప్పటివరకు కేవలం రూ.750 మాత్రమే పెంచాడు. జగన్ రెడ్డి చేసిన ద్రోహంతో ప్రతి పింఛన్ దారుడు సంవత్సరానికి రూ.30వేలు కోల్పోయాడు.

రూ.200లు ఉన్న పింఛన్ ను ఒకేసాని రూ.2వేలకు పెంచిన ఘనత చంద్రబాబు ది. రాష్ట్రఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, వృద్ధులు..వికలాంగులు.. వితంతువు లు సంతోషంగా ఉండాలని చంద్రబాబు పింఛన్ సొమ్ముని ఊహించని విధంగా పెంచారు. పెంచిన పింఛన్ల ద్వారా ప్రతి పింఛన్ దారుడు 18వేల నుంచి రూ. 20వేల వరకు లబ్ధిపొందాడు.

ప్రతివిద్యార్థికి అమ్మఒడి అన్న జగన్.. అధికారంలోకి వచ్చాక మాటమార్చి తల్లులకు ఇస్తానని ఇప్పటివరకు ప్రతి తల్లికి రూ.75వేలు ఎగ్గొట్టాడు
అమ్మఒడి అమల్లో కూడా జగన్ రెడ్డి తల్లుల్ని, విద్యార్థుల్ని దారుణంగా మోసగించాడు. ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తానన్న జగన్, అధికారంలోకి వచ్చాక తల్లులకు మాత్రమే ఇస్తానని నాలుక మడతేశాడు. రాష్ట్రంలో 84లక్షల మంది విద్యార్థులుంటే, అందరికీ ఇవ్వకుండా కేవలం 44లక్షల మందికే ఇస్తూ, 40 లక్షల మందికి అన్యాయం చేశాడు. ఆ విధంగా ప్రతి తల్లికి 5 సంవత్సరాలకు రూ.75వేలు ఎగ్గొట్టాడు. ఈ విధంగా జగన్ నిర్వాకంతో తల్లులు, వారి పిల్లలతో పాటు పింఛన్ దారులు దారుణంగా నష్టపోయారు. ఇప్పటివరకు 5 సార్లు అమ్మ ఒడి సాయం అందించాల్సి ఉంటే మూడుసార్లు మాత్రమే ఇచ్చాడు. దానిలో కూడా ఇస్తానన్న మాట ప్రకారం రూ.15వేలు ఇవ్వకుండా రూ.13వేలతోనే సరిపె ట్టాడు.

కోటికి పైగా మహిళలుంటే, కేవలం 2,3 లక్షలమందికే జగన్ చేయూత సాయం అందించాడు. 50లక్షల మందికి గాను కాపునేస్తం పథకాన్ని 2.50లక్షల మందికే అమలు చేశాడు
చేయూత పథకం.. కాపు నేస్తం.. విద్యాదీవెన వంటి పథకాల్లో కూడా జగన్ రెడ్డి ఇలానే కోతలు పెట్టాడు. చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతిమహిళకు సంవత్సరానికి రూ.18వేలు ఇస్తాననిచెప్పి మాటతప్పాడు. రాష్ట్రంలో కోటికి పైగా మహిళలుంటే. కేవలం 2,3 లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. రాష్ట్రంలో 50లక్షల మంది కాపు సామాజిక వర్గ మహిళ లుంటే, కేవలం 2లక్షల మందికే కాపునేస్తం పథకం కింద అరకొర ఆర్థిక సాయం చేశాడు. ఈ విధంగా అన్ని పథకాల్లో జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చింది గోరంత.. వారి నుంచి, రాష్ట్రం నుంచి కొట్టేసింది కొండంత. నవరత్నాల పేరుచెప్పి ప్రజల్ని నయవంచనకు గురి చేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్ రెడ్డి అమ్మఒడి, చేయూత, సామాజిక పింఛన్లు, కాపునేస్తంలో ఎంత బకాయి ఉన్నాడో ఆ సొమ్ము మొత్తం ఇచ్చాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే, వైసీపీకి, జగన్ కు ఓట్లు అడిగే అర్హత లేదు.

చంద్రబాబునాయుడిహాయాంలో 54 లక్షల మందికి పింఛన్లు అందించారు. కల్లుగీత కార్మికులు, డప్పుకళాకారులు, మత్స్యకారులు, హిజ్రాలకు కూడా పింఛన్లు ఇచ్చారు
చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ రూ.7లక్షల కోట్లు ఉన్నప్పుడే దాదా పు 54లక్షల మందికి సామాజిక పింఛన్లు అందించింది. వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు అందించింది. వారితో పాటు కిడ్నీ వ్యాధి గ్రస్తులకు, తలసేమియా బాధితులకు కూడా టీడీపీప్రభుత్వం పింఛన్లు అందించిం ది. నిరుద్యోగులకు నెలానెలా భృతి అందించింది. ఒంటరి మహిళలకు తొలిసారి దేశంలో పింఛన్లు అందించిన ఘనత కూడా టీడీపీప్రభుత్వానిదే. అసలు భారత దేశానికి తొలుత పింఛన్లను పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీఆర్ తొలుత రూ.30లతో పింఛన్ విధానానికి శ్రీకారం చుట్టారు.

పింఛన్లు, చేయూత, అమ్మఒడి, కాపునేస్తంసహా వివిధ పథకాల కింద ఎంత ఇస్తానని చెప్పాడో, ఇప్పటివరకు ఎంతసొమ్ము చెల్లించాడో వాస్తవాలు తెలియచేసస్తూ జగన్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
తెలుగుదేశం హాయాంతో పోలిస్తే తన పాలనలో ఎంతమందికి అదనంగా పింఛన్లు ఇచ్చాడో, ఎంత మొత్తం ఇచ్చాడో జగన్ వాస్తవాలు చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల బడ్జెట్లో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తే, జగన్ రెడ్డి బడ్జెట్ మొత్తాన్ని రూ.11లక్షలకోట్లకు పెంచి కూడా పేదలకు ఎందుకు న్యాయం చేయలేకపోయాడో చెప్పాలి. పింఛన్లలో కోతలు..విద్యుత్ కోతలు..ఇలా అన్నింటిలో కోతలు పెట్టాడు. జగన్ సర్కార్ పేదల్ని నిలువునా ముంచేసింది. జగన్ రెడ్డి మోసపు ప్రకటనలు.. మోసకారీ సంక్షేమాన్ని ప్రజలు గ్రహించాలి. సామాజిక పింఛన్లు, అమ్మఒడి, చేయూత, కాపునేస్తం పథకాలకింద తన పాలనలో ఎంతమందికి, ఎంత సొమ్ము చెల్లించాడో తెలియచేస్తూ జగన్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి.

ప్రజలు వైసీపీకి ఉరిశిక్ష వేసేశారు. ఎన్నికల సమయంలో దాన్ని అమలు చేస్తారు జగన్ ఇప్పుటికిప్పుడు ఏ పథకం అమలు చేసినా… చంద్రబాబు చెబితేనే చేశాడని ప్రజలు అనుకుంటారు
ప్రజాకోర్టులో ఇప్పటికే వైసీపీకి ఉరిశిక్ష పడింది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనను ఛీదరించి.. అసహ్యించుకున్న ప్రజలు ఇప్పటికే శిక్ష వేశారు. వచ్చే ఎన్నికల్లో దాన్ని అమలుచేస్తారు. కొవ్వు పేరుకుపోయి ఉన్నారు కాబట్టి.. ముఖ్యమంత్రికి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు దించిన బుల్లెట్లు తాలూకా నొప్పి తెలియడంలేదు. చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ ద్వారా, తాను అధికారం లోకి వస్తే ప్రజలకు ఏంచేసేది చెప్పారు. మహాశక్తి, తల్లికి వందనం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఇంటింటికీ ఉచితంగా సురక్షిత తాగునీరు అందిస్తానని చెప్పారు.

జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను తానే అమలుచేస్తున్నట్టు ప్రజల్ని నమ్మించేం దుకు జగన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు. ఓటమి భయంతోనే జగన్ ఇప్పుడు హాడావుడిగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు తానే ఇస్తానంటున్నాడు. జగన్ ఏంచేసినా..ఎన్ని చేసినా చంద్రబాబు చెబితేనే, జగన్ చేశాడని భావిస్తారు. 57 నెలలు ఎందుకు తాను ఇచ్చిన హామీలు అమలుచేయలేదో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి.” అని బొండా ఉమా డిమాండ్ చేశారు.

 

LEAVE A RESPONSE