Suryaa.co.in

Andhra Pradesh

స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు రాజకీయ ప్రకటనలు

-వీటికి అనుగుణంగానే రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్ల అనుమతి
-పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్కు అనుమతి
-ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీచేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లును, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన సందర్బంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంతో పాటు పలు సమస్యలను తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు.

ఎప్పటి నుండో శాశ్వత ప్రాతిపదిక ఉన్న పార్టీ కార్యాలయాల్లో అనుమతి పొంది ఉన్న హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలన్నారు. అయితే ఆ హోర్డింగుల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్ ను అనుమతించాలన్నారు.

రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పని సరని, అయితే ఇందుకు 48 గంటల ముందుగా సువిధా పోర్టల్లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితిల్లో రాజకీయ పార్టీలు 48 గంటల ముందు ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేని పక్షంలో ఆఫ్ లైన్ ద్వారా కూడా అత్యవసర ధరఖాస్తులను స్వీకరించి, ఆ వివరాలు అన్నింటినీ ఎన్కోర్ (Encore) పోర్టల్లో నమోదు చేసి సకాలంలో తగిన అనుమతులను జారీచేయాలని సూచించారు.

ముందుగా అనుమతి పొందిన తదుపరే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన అమలు దుస్సాధ్యమని, ఈ నిబంధనను పున: సమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్త కంఠంతో కోరారన్నారు. ఈ నిబంధన అమలు విషయంలో పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు, భారత ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

అదే విధంగా రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబందించి భారత ఎన్నిక సంఘం మార్గదర్శకాలతో పాటు ఆంద్రప్రదేశ్ పురపాలక చట్టం, స్థానిక సంస్థల చట్టం, జి.హెచ్.ఎం.సి. చట్టాలను పరిగణలోకి తీసుకుంటూ అనుమతులను మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతో పాటు కార్యాలయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దన్నారు.

ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల ప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయిచాలని, నూతన హోర్డింగులకు అనుమతులను ఏమాత్రం ఇవ్వద్దన్నారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు ఎటు వంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలన్నారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని ఒక సారి పరిశీలించాలని, స్ట్రక్చర్ లో ఏమాత్రం దృడత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు.

ముందస్తు అనుమతితో ప్రైవేటు ప్రాంగణాల్లో సులువుగా తరలించగలిగే ఒక జండాను, చిన్న బ్యానర్ ను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించాలని సూచించారు. అదే విధంగా సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిష్టాన్ని పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు.
ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో లు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు , డిప్యూటీ సీఈవో లు కె. విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE