Suryaa.co.in

Andhra Pradesh

గులాబ్ తుఫాను బాధితుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యం

– పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
– బాధితులకు టీడీపీ నాయకులు, శ్రేణులు అన్ని విధాల అండగా నిలవాలి
– పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్
గులాబ్ తుఫాను నేపథ్యంలో టీడీపీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తుల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో సమర్థంగా పనిచేసింది. హుదూద్, తిత్లీ తుఫాన్లు సంభవించినప్పుడు ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచాం. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. గంటల వ్యవదిలో విద్యుత్ ను పునరుద్ధరించాం. అండర్ గ్రౌండ్ కేబులు వ్యవస్థను ఏర్పాటు చేశాం. మంత్రులు, టీడీపీ నేతలు, అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలను ఆదుకోవడం జరిగింది. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌, 2 కిలోల కందిపప్పు, లీటరు పామాయిల్‌, అరకిలో కారప్పొడి, అరకిలో ఉప్పు, కిలో చక్కెర, 3 కిలోల బంగాళ దుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు పంపిణి చేశాం.
రైతులకు పంట నష్టం జరిగితే తగిన విధంగా పరిహారం అందజేయడం జరిగింది. పంట నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడం జరిగింది. ప్రకృతి విపత్తుల కింద నష్టపోయిన వివిధ పంటలకు తెలుగుదేశం ప్రభుత్వం నష్టపరిహారాన్ని సుమారు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెంచడం జరిగింది. జగన్ రెడ్డి మాత్రం గాలి మాటల తప్ప చేస్తుంది శూన్యం. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన సమయంలో వరి, చెరకు, పత్తి, వేరుశనగ పంటలకిచ్చే పెట్టుబడి రాయితీని టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచడం జరిగింది.
తిత్లీ, పెథాయ్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న వరికి హెక్టారుకు రూ.20 వేలకు పెంచాం. మొక్కజొన్నకు రూ.8,333 నుంచి రూ.12,500, అపరాలు, పొద్దుతిరుగుడుకు రూ.6,250 నుంచి రూ.10 వేలకు పెంచడం జరిగింది. తిత్లీ, పెథాయ్ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న కొబ్బరి, జీడి పంట రైతులను ఆదుకున్నాం. తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ కింద మొత్తం రూ.3,759.51 కోట్లు విడుదల చేయడం జరిగింది. జగన్ రెడ్డి మాత్రం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లో రైతులను దారుణంగా మోసం చేశారు. అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
ఇప్పుడు గులాబ్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర బాగా దెబ్బతింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మనం అందరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. జనజీవనం స్థంభించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటున్నారు.
జగన్ రెడ్డి మాత్రం ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ విపత్తు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారం ఉంది. జగన్ రెడ్డికి ఇరిగేషన్ అంటే తెలియదు. నీరు వృధా గా పోతున్నా నిర్లక్ష్యం వహించారు. సోమశిల ఓవర్ ఫ్లో కావడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం. ఇప్పుడు కష్టాల్లో ఉన్న ప్రజలకు తెలుగుదేశం శ్రేణులు అండగా నిలవాలి. ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ముందుకు కదిలాం. ఇది మనందరి బాధ్యత.
ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారి ఆహార అవసరాలు తీర్చడం, నష్ట పరిహారం కోసం కృషి చేయడం వంటి కార్యక్రమాలను టీడీపీ నాయకులు, శ్రేణులు చేపట్టాలి. హుదూద్ సమయంలో రూ.791 కోట్లు ఖర్చు పెట్టి విశాఖలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వల్ల ఆయా ప్రాంతాల్లో నష్టం తప్పింది.
అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు : టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలిచాం. ఉత్తరాఖండ్, కర్నూలు వరదల సమయంలో అధికారంలో లేకపోయినా ప్రజలను అన్ని విధాల ఆదుకున్నాం. తిత్లీ, హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు గారు త్వరతగతిన స్పందించి.. క్షేత్రస్థాయిలో పర్యటించి యుద్ధప్రాతిపదికన ప్రజలను ఆదుకున్నారు. గులాబ్ తుఫానుపై జగన్ రెడ్డి, అధికారులు తీవ్ర నిర్లక్ష్య వహించారు. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంది. మత్య్సకారులను ఆదుకోవడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్షంగా మనం అండగా నిలవాలి. ప్రతి ఇంటికి రేషన్ అందించాలి.
నిమ్మల రామానాయుడు, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత : గులాబ్ తుఫాను ప్రభావంతో పంటలు ఎక్కువగా నష్టపోయాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. డ్రైన్స్ లో పూడిక తీయకపోవడం వల్ల గోదావరి జిల్లాల్లో పంటలకు నష్టం జరిగింది. జగన్ రెడ్డి తాడేపల్లికే పరిమితం అయ్యారు. గతంలో తుఫాన్ల సమయంలో గాలిలో ఏరియల్ సర్వే నిర్వహించి ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. బాధితులకు రూ.5వేలు ఇస్తామని చెప్పి విస్మరించారు. బాధితులకు టీడీపీ శ్రేణులు అన్ని విధాల అండగా నిలిచారు. టీడీపీ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE