Suryaa.co.in

Andhra Pradesh

2024లో మళ్ళీ సీఎం జగనే

– ఎంపీ విజయసాయి రెడ్డి

డిసెంబర్ 28, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో 2024లోవైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కానున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గురువారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు. ఆయన చేతులు మీదుగా రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించాయని, గ్రాసిం ఇండస్ట్రీస్, ప్యానల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్, ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్, సన్నీ ఒప్పా టెక్, ఏటీసీ టైర్స్, రాంకో సిమెంట్స్, డిక్సన్, గ్రీన్ లాం సౌత్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, యూజీయూ స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారన్ సింథటిక్ ల్యాబ్, లారస్ ల్యాబ్, సెంచురీ ప్యానల్స్ మెదలగు సంస్థలు ప్రధానమైనవని అన్నారు.

గంజాయి సాగు, స్మగ్లింగ్ పై ఏపీ పోలీసులు ఉక్కుపాదం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు, స్మగ్లింగ్ పై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపారని విజయసాయి రెడ్డి అన్నారు. 2023 సంవత్సరంలో ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలు పోలీసులు ధ్వంసం చేశారని అన్నారు. గంజాయి ఒక రకమైన మానసిక ఉత్ప్రేరక డ్రగ్, అది సమాజానికి హాని చేస్తుందని అన్నారు. అలాగే గంజాయి అమ్మకం దార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించిందని అన్నారు.

ముమ్మిడివరం ఎంఎల్ఏ కు ప్రగాఢ సానుభూతి
అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మమ్మడివరం ఎంఎల్ఏ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు దుర్మరణం పాలవ్వడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ మేరకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఎంఎల్ఏ కు, ఇతర కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని అందించాలని ప్రార్ధిస్తున్నానని, కష్ట సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని విజయసాయి రెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE