– ప్రజా అవసరాల మేరకే విద్యుత్ ఒప్పందాలు
– పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులతో రాష్ట్రాభివృద్ధి
– యాక్సిస్ తో యువతకు ఉద్యోగ అవకాశాలు, ఖజానాకు పన్నుల లబ్ధి
– ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ హయాంలో యూనిట్ విద్యుత్ ను కేవలం రూ.2.49 కు మాత్రమే కొనుగోలు చేశామని జగన్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ను దాదాపు రూ.5 కంటే ఎక్కువ ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. యాక్సిస్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై వైసీపీ నాయకులు సత్య దూరమైన మాటలు చెప్తున్నారని మంత్రి వివరించారు. యాక్సిస్ తో చేసుకున్న ఒప్పందం వందకు వంద శాతం సక్రమమే అని పేర్కొన్నారు. యాక్సిస్ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపేణా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
స్వలాభం కోసం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు, ప్రజా అవసరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలకు చాలా తేడా ఉందని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా మానుకోవాలని మంత్రి గొట్టిపాటి హితవు పలికారు.
అవినీతిలో మునిగితేలిన జగన్కు.. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి కూడా వక్రంగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సెకీ కేవలం సోలార్ ఎనర్జీ మాత్రమేనని తెలిపిన మంత్రి గొట్టిపాటి.., యాక్సిస్ కంపెనీ సోలార్, విండ్ తో పాటు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తుందని, దీని ద్వారా ప్రజావసరాలు, విద్యుత్ వినియోగం మేరకు అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రానికి అన్ని విధాలా లబ్ధి కలిగే యాక్సిస్ విద్యుత్ ఒప్పందాలపై జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా విష ప్రచారాలు ఆపాలన్నారు. వైసీపీ ప్రభుత్వ అనైతిక విద్యుత్ ఒప్పందాలతో… అత్యధిక విద్యుత్ వినియోగం (పీక్ అవర్స్) జరిగే సమయంలో ప్రస్తుతం యూనిట్ కు రూ.8 నుంచి 10 వరకు వెచ్చించి విద్యుత్ కోనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు.
ఇటువంటి సమస్యలను అధిగమించేందుకు… సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజీ తో చేస్తున్న తొలి ప్రాజెక్టును త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.