ఆరిపోయిన టీడీపీకి అధ్యక్షుడు చంద్రబాబు

– మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి ప్రజలకు మోసం
– ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో నమ్మించే యత్నం
-చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్‌ ఫైర్‌

బాబు ఆరిపోయిన పార్టీ అధ్యక్షుడు:
ఆరిపోయిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడైన చంద్రబాబు నిన్న ఐ–టీడీపీ సదస్సులో కొన్ని తిక్కమాటలు మాట్లాడాడు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని ఎవరైనా చెబుతారు. అలాంటి పార్టీలో పాపం, అభం శుభం తెలియని కొందరు కుర్రాళ్లు ఐ–టీడీపీ పేరుతో పని చేయాలని ఆపార్టీ నేతలు తెచ్చుకున్నారు. నిజానికి ఐ–టీడీపీ అనేది ఎక్కడా లేదు. ఉన్నదల్లా.. ఐపీ–టీడీపీ మాత్రమే. చంద్రబాబు జీవితమంతా మోసాలు, దగా, అబద్ధాలే. ఇది జగమెరిగిన సత్యం. నాడు టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని లాక్కుని కొన్నాళ్లు నడిపాడు. 2019 ఎన్నికల్లో ప్రజల ఛీత్కారానికి గురై చిత్తుగా ఓడిపోయాడు. ఈరోజు ఆరిపోయిన ఐపీ టీడీపీకి అధ్యక్షుడుగా ఉన్నాడు.

దీపం సబ్సిడీకి మంగళం:
నోరు తెరిస్తే అబద్ధాల పుట్టగా మారిన చంద్రబాబు నిన్న దీపం పథకం గురించి ఏమీ తెలియని కుర్రాళ్లకు చెప్పాడు. తాను ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారనే భ్రమల్లో ఉన్న చంద్రబాబు శుద్ధ అబద్ధాల్ని కూడా కన్నార్పకుండా చెబుతాడు. 2014 టీడీపీ మేనిఫెస్టోలోని 17వ పేజీలో (ఈ సందర్భంగా ఆ పేజీ చూపిన మంత్రి) దీపం సిలిండర్లపై చంద్రబాబు హామీ ఉంది. రాష్ట్ర మహిళలకు ఏటా 12 సిలిండర్లపై ఏటా రూ.100 చొప్పున సబ్సిడీ ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. అంటే ఒక్కో మహిళలకు 5 ఏళ్లలో మొత్తం రూ.6 వేల సబ్సిడీ ఇస్తానన్న చంద్రబాబు, దాన్నీ ఎగ్గొట్టాడు. 2014 నుంచి 2019 వరకు ఏ ఒక్క మహిళకు అయినా బాబు ఒక్క రూపాయి అయినా సబ్సిడీ ఇచ్చి ఉంటే చెప్పమనండి. ఇది ఎన్నిసార్లు అడిగినా, బాబు నుంచి సమాధానం రావడం లేదు.

డ్వాక్రా రుణాలనూ ఎగ్గొట్టాడు:
రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, వారిని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు, చివరకు డ్వాక్రా మహిళలనూ వదిలిపెట్టలేదు. వారి రుణాలు రూ.14,500 కోట్లు బ్యాంకులకు కడతామని చెప్పి, దాన్నీ ఎగొట్టాడు. అదీ చంద్రబాబు చరిత్ర. అందరినీ దగా చేయడమే ఆయన ప్రవృత్తి.

హాస్టళ్లూ కట్టివ్వని నీచుడు:
ఆడపిల్లలకు హాస్టళ్లు కట్టివ్వని నీచుడు చంద్రబాబు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకు మంచి రోజులొస్తాయంటూ వారిని నమ్మించి మోసం చేశాడు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన మరో అబద్ధం.. బాలికలకు మండలాల్లో ప్రత్యేక హాస్టళ్లు నిర్మిస్తానన్న హామీ. దాన్నీ పట్టించుకోని చంద్రబాబు, రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క హాస్టల్‌ కూడా కట్టలేదు. అలా బాలికలనూ మోసం చేసిన నీచుడు చంద్రబాబు.

యువతను దగా చేసిన చంద్రబాబు:
ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అది వచ్చే వరకు ప్రతి నెలా రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో ప్రకటించిన చంద్రబాబు.. చివరకు యువతనూ దగా చేశాడు. అటు ఉద్యోగం ఇవ్వలేదు. ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.

వారు బాబును నిలదీయాలి:
ఇప్పుడు ఐ–టీడీపీలో పని చేస్తున్న యువతకు, ఆనాడు తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన మోసాలు, ఆయన నిజ స్వరూపం తెలియదు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు నిరుద్యోగ భృతినీ ఎగ్గొట్డాడు. అందుకే ఈ రెండు విషయాలపై ఐటీడీపీ యువత కూడా చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది.

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?:
ఇప్పుడు చంద్రబాబు నోట కొత్తగా పీ4 మంత్రం వినిపిస్తోంది. అందుకే ఆయన ఇప్పుడు చంద్రబాబాగా అవతారం ఎత్తాడేమో అనిపిస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబును నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? దీనికి చంద్రబాబు జవాబు చెప్పాలి. పేదలంటేనే అస్సలు పడని చంద్రబాబు ఇప్పుడు వారి గురించి మాట్లాడుతుంటే ప్రజలెవ్వరూ నమ్మడం లేదు.

నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లపట్టాలు ఇస్తుంటే, కడుపు మంటతో రగిలిపోయి ఎక్కడికక్కడ కోర్టుల్లో కేసులు వేయించి, అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తే, డెమొగ్రాఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ ఏర్పడుతుందంటూ.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి, అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని ప్రజలెవ్వరూ మర్చిపోలేదు.

బాబూ దమ్ముంటే రా… చూపిస్తాను:
చంద్రబాబు నిన్న మా మంత్రుల గురించి ఎటకారంగా మాట్లాడాడు. బాబూ.. చంద్రయ్యా.. మేం నీ కొడుకులాగా శుద్ధ దద్దమ్మలం కాదు. మీ మాదిరిగా మేము దొడ్డిదారిలో, వెన్నుపోటుతో అధికారంలోకి రాలేదు. ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా నీ కొడుకు పప్పు లోకేశ్‌లా మేం మంత్రులం కాలేదు. మా పార్టీలో కష్టపడి పని చేశాం. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశాం. మా నాయకుడు జగన్‌గారి స్ఫూర్తితో ప్రజలతో మమేకం కావడం వల్లనే మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించారు. ఆ విషయం గుర్తుంచుకో. మరో మాట.. నేను మంత్రిగా 10 ఇళ్లు కూడా కట్టించలేదని ఎటకారం చేస్తావా? బాబూ, నీకు దమ్ముంటే రా. నా నియోజకవర్గానికి వస్తావా? అక్కడ ఎన్ని ఇళ్లు కట్టించామో చూపిస్తా. మరి నీకు వచ్చే« ధైర్యం ఉందా?.

నేల మీద పాకినా గెలవబోడు:
చంద్రబాబు మాదిరిగా ఆయన కొడుకు కూడా నోటికి ఏదొస్తే అది పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పెద్దా, చిన్నా అనేది లేకుండా విమర్శిస్తూ, బూతులు మాట్లాడుతున్నాడు. అందుకే ఒక తండ్రిగా చంద్రబాబు తన కొడుక్కి సంస్కారం నేర్పాల్సిన అవసరం ఉంది. అలాంటి అసమర్థుడు, బుర్ర తక్కువ వెధవ, పప్పుముద్ద తన కొడుకుగా పుట్టినందుకు చంద్రబాబు సిగ్గు పడాలి. మాట్లాడితే రాజీనామా చేస్తానంటున్న లోకేశ్, అసలు ఏ పదవికి రాజీనామా చేస్తాడో కాస్త స్పష్టంగా చెబితే బాగుంటుంది. ఈ సందర్భంగా నేనో విషయం స్పష్టం చేస్తున్నాను. నారా లోకేశ్, పాదయాత్ర కాదు కదా.. నేలపై పాకినా, పొర్లాడినా కూడా ఎన్నికల్లో గెలవబోడు.

మా నేత చెప్పాడంటే చేస్తాడు:
పేదలకు నిజంగా మేలు చేయాలంటే పీ4, పీ5, పీ6 అంటూ మంత్రాలు వల్లె వేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఇది బాబు తెలుసుకోవాలి. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఉండాలి. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. మా నేతకు అలా అంకితభావం ఉంది కాబట్టే.. ఆయన ఈరోజు ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన నిరంతరం పేదలకు అండగా ఉన్నారు. వారి బాధలు, కష్టాలను అర్ధం చేసుకున్నారు. నేను విన్నాను. నేను ఉన్నాను అంటూ.. వారికి ఎంతో భరోసా ఇచ్చారు.
అందుకే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు మొత్తం రూ.2.11 లక్షల కోట్లు డీబీటీ రూపంలో జమ చేశారు. పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించారు. అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసి చూపారు. అదీ జగన్‌గారి ఘనత అని మంత్రి జోగి రమేశ్‌ వివరించారు.

Leave a Reply