Suryaa.co.in

Telangana

కేసీఆర్ అంటే..కాళేశ్వరం కరప్షన్ రావు

మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలితీసుకుంటే… ఆ ప్రాజెక్టే కేసీఆర్‌ను బలి తీసుకుంటుంది
నాసిరకం పనులతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా
కేంద్ర సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నకేసీఆర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందని ..కోట్లాది రూపాయల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలితీసుకుంటే.. ఇప్పుడు ఆ ప్రాజెక్టే కేసీఆర్‌ను బలి తీసుకుంటున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గుడినీ, గుడిలో లింగాన్నీ దిగమింగిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం శిక్షించాలన్నారు.

కేసీఆర్ పాపం పండింది… కేసీఆర్ అవినీతి కుండ పగిలింది.. మేడిగడ్డ కుంగింది.. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరైంది.. అని వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న రాహుల్‌గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన అనంతరం మీడియాతో రేవంత్‌రెడ్డి‌ మాట్లాడారు.

బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీ కాపాడుతున్నదన్నారు. ఈ రెండు పార్టీల అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు, దాని పరిధిలోని బ్యారేజీలు బలవుతున్నాయన్నారు. కేసీఆర్ అంటే ఇంతకాలం ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పుకున్నారని, ఇప్పుడు కాళేశ్వరం కరప్షన్ రావు అని సంబోధించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నాసిరకం పనులతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు.

రైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని తెలిపారు. పిల్లర్స్ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప ఏంటనేది తెలుస్తుందన్నారు.

ప్రాజెక్టును నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించి తీరుతామన్నారు.

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆర్‌ఎస్‌కు స్పష్టత వచ్చిందని తెలిపారు. అందుకే కేసీఆర్ కేంద్రం సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించి తీరుతామని స్పష్టం చేశారు.

మోడీ కంకణం కట్టుకుని కేసీఆర్‌ను గెలిపించాలనుకున్నా అది జరగదన్నారు. తమరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని…. కేసీఆర్‌ను పడగొడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE