Suryaa.co.in

Andhra Pradesh

కూట‌మి పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యం ఖూనీ

– స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అడ్డదారిలో కూట‌మి గెలుపు
– ప్రలోభాలు, బెదిరింపులతో దిగజారుడు రాజకీయం
– మండిపడ్డ వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

తాడేప‌ల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అడ్డదారిలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పదవులను చేజిక్కించుకునేందుకు దిగజారుడు రాజకీయంకు పాల్పడిందని వైయస్ఆర్‌సీపీ కేంద్రపార్టీ కార్యాలయ ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు.

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రలోభాలు, బెదిరింపులతో వైయస్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుని పదవులను దక్కించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ప్రజాతీర్పుతో గెలిచిన వారిని పార్టీ ఫిరాయించేలా చేయడం ద్వారా దక్కించుకున్న పదవులకు గౌరవం ఉంటుందా? చంద్రబాబు అరాచక పాలనను చూసి ప్రజాస్వామికవాదులు నివ్వెరపోతున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే…

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలకు గాను వైయస్సార్సీపీకి 18 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్ల బలం ఉంది. ఒక కౌన్సిలర్ స్థానం ఖాళీగా ఉంది. కానీ తాజాగా ఈ రోజు జరిగిన ఉప ఎన్నికలో వైయస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి తమవైపు తిప్పుకుని టీడీపీ 15 మంది కౌన్సిల‌ర్ల‌ బలంతో మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. 9 మంది వైయస్సార్ సీపీ కౌన్సిలర్లను టీడీపీ భయపెట్టి, ప్రలోభపెట్టి చైర్మన్ పదవిని లాక్కున్నారు.

ఎన్నిక‌లు జరిగిన నిర్వ‌హించిన కుప్పం, పాల‌కొండ‌, మాచ‌ర్ల‌, తుని, మాచ‌ర్ల‌… ఇలా అన్నింటా వైయ‌స్సార్సీపీకే మెజారిటీ ఉన్నా టీడీపీ విజ‌యం సాధించడం చూస్తే కూట‌మి పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యం ఎంత‌గా ఖూనీ అవుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తూ.. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్ ల‌తో దొడ్డిదారిలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు.

పైగా వైయస్ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన అభ్య‌ర్థుల‌ను లాక్కుని, అదేదో గొప్ప విజ‌యంలాగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 స్థానాల్లోనూ గ‌తంలో వైయస్సార్సీపీ గెలుపొందింది. ఒక్కస్థానంలోనూ గెలవని టీడీపీ, నేడు వైయస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. ఇంకోప‌క్క ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే విధంగా ఎల్లో మీడియాలో కూట‌మి సాధించిన విజ‌యం అన్న‌ట్టు ప్ర‌చారం చేసుకుంటున్నారు. వాపును చూసి అదే బ‌ల‌మ‌ని కూట‌మి నాయ‌కులు పొర‌ప‌డుతున్నారు.

ఎల్ల‌కాలం ఇలాంటి విధానాలతోనే విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని కూట‌మి నాయ‌కులు అనుకుంటే మాత్రం అంత‌క‌న్నా అవివేకం ఇంకోటి ఉండ‌దు. రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు. మా పార్టీ అభ్య‌ర్థుల‌కు విప్‌లు జారీ చేయ‌డం జ‌రిగింది. వైయస్సార్సీపీ గుర్తుపై గెలిచి, ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపిన వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం జ‌రిగింది.

నాలుగేళ్ల క్రితం స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగినప్పుడు ప్ర‌జాపాల‌న‌తో వైయ‌స్సార్సీపీ అభ్య‌ర్థులు 95కిపైగా స్థానాల్లో విజ‌యం సాధించారు. మ‌రో ఏడాది కాల‌వ్య‌వద్ధి ఉన్నా వాటిని ద‌క్కించుకోవ‌డానికి కూట‌మి నాయ‌కులు అడ్డ‌దారులు తొక్కడం హేయం. దీన్ని ప్ర‌జాస్వామ్య వాదులంతా ఖండించాలి.

గ‌తంలో 38 స్థానాలున్న తాడిప‌త్రి మున్సిపాలిటీకి ఎన్నిక‌లు జ‌రిగితే వైయ‌స్సార్సీపీ 18, టీడీపీ 20 స్థానాలు గెలిచాయి. వైయస్సార్ సీపీ కంటే టీడీపీకి రెండు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. నాడు మేము తల్చుకుంటే, మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి కైవసం చేసుకుని ఉండేవాళ్లం. కానీ, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా గెలిచిన పార్టీకే చైర్మ‌న్ పీటం వ‌దిలేయాల‌ని నాడు వైయస్ జగన్ మాతో చెప్పారు.

అధికారంలో మేం ఉన్న‌ప్ప‌టికీ నాటి మా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని, వార‌బ్బాయిని హౌస్ అరెస్ట్ చేయించారు. ఈ నేప‌థ్యంలో మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా గెలిచిన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి విలేకరుల సమక్షంలో ..‘హ్యాట్సాఫ్‌ టు జగన్‌’ అని ఓపెన్ గా చెప్పారు. వైయస్ జగన్ తలుచుకుంటే తనను గెలవకుండా ఆపగలిగేవారని, కానీ ఆయన అలా అనుకోలేదు కాబట్టే తాను మున్సిపల్ చైర్మన్ కాగలిగానని చెప్పారు. ఇది ప్రజాస్వామిక విలువల పట్ల వైయస్ఆర్‌సీపీకి ఉన్న గౌరవం.

LEAVE A RESPONSE