ఆయన…తొండి సంజయ్

– రైతుల జీవితాల‌తో బీజేపీ చ‌లి మంట‌లు కాచుకుంటోంది
-ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చింది
– రైతుబంధును కేంద్రం స‌హా 11 రాష్ట్రాలు కాపీ
– కేంద్రంపై కేటీఆర్ ఫైర్
దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పింది అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేటీఆర్ గుర్తు చేశారు. రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్ తపన అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బండి సంజ‌య్ తొండి సంజ‌య్‌లాగా మారారు అని ధ్వ‌జ‌మెత్తారు.
బండి పాద‌యాత్ర చేసిన‌ప్పుడు మ‌న రైతు వేదిక‌ల్లో బ‌స చేశార‌ని గుర్తు చేశారు. వ్య‌వ‌సాయం ఉమ్మ‌డి జాబితాలో ఉంది.. రాజ్యాంగం ప్ర‌కారం ధాన్యం కొనాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వానిదే అని స్ప‌ష్టం చేశారు.కేంద్రం యాసంగి వడ్లు కొంటామ‌నే దాకా బీజేపీని వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడ‌లు వంచాము.. వ‌రి కొనుగోలు కోసం బీజేపీ మెడ‌లు వంచ‌లేమా అని కేటీఆర్ అన్నారు. రైతుల వెంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల మ‌హా ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.
న‌డి ఎండ‌కాలంలోనూ చెరువులు మ‌త్త‌డి దుంకుతున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును కాలంతో పోటీ ప‌డి కేసీఆర్ నిర్మించారు. రైతుల‌కు ఏ క‌ష్టం రాకుండా సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారు. ధాన్యం ఉత్ప‌త్తిలో పంజాబ్‌ను తెలంగాణ మించిపోయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గ్రామాల బాట ప‌ట్టి వ్య‌వ‌సాయం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాత విధానాల వ‌ల్లే ఇది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోంది అని కేటీఆర్ అన్నారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చింది. సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామ‌న్నారు. 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఎరువులు, విత్త‌నాల‌కు లైన్లు క‌ట్టే ప‌రిస్థితి లేదు. స‌కాలంలో రైతుల‌కు ఎరువులు, విత్త‌నాలు అందిస్తున్నాం. పాల‌కుల మ‌న‌సు బాగుంటే అన్ని బాగుంటాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. చెరువులకు రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టి భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచుకున్నామ‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తుంది. మ‌న రైతుబంధును కేంద్రం స‌హా 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయ‌న్నారు. రైతు చ‌నిపోయిన ప‌ది రోజుల్లోపై రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నాము.
తెలంగాణలో ప్రాజెక్టుల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి పెరగగానే కేంద్రం కొర్రీలు పెడుతోంది అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాకు వరి పంట వేయడం తప్ప వేరేది రాదని మన రైతులు అంటున్నారు. కేంద్రం మాత్రం వరి వద్దు అంటోంది. పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా..? అని ప్ర‌శ్నించారు. దేశానికి ఒక్క విధానం ఉండనవసరం లేదా? అని అడిగారు. బీజేపీ ఓట్ల కోసం రాజ‌కీయాలు చేస్తోంద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. చిల్ల‌ర ఓట్ల కోసం రైతుల జీవితాల‌తో బీజేపీ చ‌లి మంట‌లు కాచుకుంటోంది అని నిప్పులు చెరిగారు. బీజేపీ రాజ‌కీయాల‌కు ధీటుగా స‌మాధానం చెప్తామ‌న్నారు.

Leave a Reply