Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర నిధులకు బటన్‌ నొక్కటం తప్ప అభివృద్ధి శూన్యం

– ఒకసారి ఓటేస్తే రెండు దశాబ్దాలు వెనక్కి…
-మరోసారి ఓటేస్తే రాష్ట్రం ఈ శతాబ్దం వెనక్కిపోతుంది

-రూ.12 లక్షల కోట్ల అప్పులో రాష్ట్ర ప్రభుత్వం
-విశ్వాసఘాతుకానికి ట్రేడ్‌ మార్క్‌ జగన్‌
-మద్యం, గంజా, డ్రగ్స్‌తో మూడు రాజధానులు చేస్తారా?
-రాష్ట్రంలో మోదీ మార్క్‌ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావటం ఖాయం
-నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలబోతే జగన్‌
-త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యం
-ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

విశ్వాసఘాతుకానికి జగన్‌ ట్రేడ్‌ మార్క్‌… ఒకసారి ఓటేస్తే రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కుపోయింది…మరోసారి ఓటేస్తే ఈ శతాబ్దం వెనక్కుపోతుంది…నరకాసురుడు,రావణుడు, దుర్యోధనుడు కలబోతే జగన్‌…మూడు పార్టీల కలయికతో రాక్షస సంహారం తథ్యమని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. విజయవాడలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోగొట్టి అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయన్నారు.

2019 ముందు అమరావతే రాజధాని అన్నాడు…2024కి నిర్వీర్యం చేశాడని విమర్శించారు. 2019 ఎన్నికలలో మద్యం నిషేధం అన్నాడు…2024కి తనకు మద్యం ఆదాయ మార్గం అంటున్నాడని…ఆయన మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. 2019 ముందు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని 2024 నాటికి కులాల విభజన చేసి మతమార్పిడులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శించారు. 2019 ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్‌ అన్నాడు… 2024కి ఉద్యోగులను బానిసలకన్నా హీనంగా చూస్తున్నాడు…2019 నుంచి ఇప్పటివరకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ సబ్‌ ప్లాన్‌ నిధులు గోల్‌మాల్‌ చేశాడని దుయ్యబట్టారు. 2019లో జగన్మోహన్‌రెడ్డి…2024 వచ్చే సరికి అయోమయం జగన్నాథంగా మారాడన్నారు.

2019లో మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం పేదలకు బిస్కెట్‌ ఇచ్చి జగన్‌ మాత్రం ఇంట్లో బంగారు బిస్కెట్లు పేర్చుకుంటున్నారని ఆరోపించా రు. రాష్ట్రంలో వివిధ పథకాల కోసం రూ.2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధు లేనని… నిధుల దుర్వినియోగంతో రాష్ట్రం అవినీతిమయమైందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకుంటున్న జగన్‌…గడచిన ఐదేళ్లుగా కేంద్రం నుంచి మోదీ పంపే నిధులకు జగన్‌ బటన్‌ నొక్కడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని దుయ్య బట్టారు. రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పులకు చేర్చిన ఘనత జగన్‌కే సొంతమన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ బిల్లులు చెల్లింపు కోసం అడుగడుగునా లంచాలు తీసుకుంటున్నారని, సామాజిక వివక్షకు పేటెంట్‌ వైసీపీ ప్రభుత్వమని ఆరోపించారు. ప్రభుత్వ బడులకు పార్టీ రంగులు అద్ది కోర్టుతో చివాట్లు తిని ఆ రంగులు మార్చడానికి రూ.2 వేల కోట్లు వృథా చేసిన సంగతి ప్రజలు మరువలేదు..నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త రూపులు అంటున్న జగన్‌ ఆ నిధు లు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పే ధైర్యం ఉందా? రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులెన్నో చెప్పి వాటికి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పే చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు తలుపు తడితే జగన్‌ బాబాయ్‌ వివేకా గుర్తు వస్తున్నారన్నారు.

నిరుద్యోగంలో దేశంలో మొదటిస్థానం
దేశంలో అతి ఎక్కువ నిరుద్యోగ రేట్‌ 24 శాతంతో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత జగన్‌కే సొంతమన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ ప్రధాని మోదీ ఇస్తే రాష్ట్రంలో జగన్‌ అమలు చేయలేదన్నారు. జగన్‌ అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులు అంటే అర్థం మద్యం, గంజా, డ్రగ్స్‌ రాజధానులుగా చేయడమా? అని ప్రశ్నించారు. అశాస్త్రీయం గా ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను మార్పులు, చేర్పులతో మార్కాపురం వంటి జిల్లాల ఏర్పాటు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ చేయడం తథ్యమన్నారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల నిర్మా ణం, రైతుల కోసం 10,700 ఆర్బీకేల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే సోకులు జగన్‌ చేస్తున్నారు…కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఒంగోలు వద్ద కొత్తపట్టణం ఫిషింగ్‌ హార్బర్‌ ఎందుకు అడుగు ముందుకు పడలేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్‌ కాలేజీలకు అనుమతులిచ్చిందని, నిర్మాణ దశలో ఉన్న బాపట్ల, నర్సీపట్నం, పిడుగురాళ్ల, అమలాపురం, పెను కొండ, పార్వతీపురం, పాలకొల్లుల మెడికల్‌ కళాశాలల కోసం రూ.3,550 కోట్లు అవసరమైతే ఇప్పటివరకు కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్న మార్కాపురం, ఆదోని, పులివెందుల, మదనపల్లి, పాడేరులలో 2024 – 25 సంవత్సరా నికి ప్రారంభం కావాల్సిన మెడికల్‌ కాలేజీలు ఆలస్యం అవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో రూ.9 వేల కోట్ల పంచాయతీల నిధుల దారి మళ్లింపుతో గడచిన ఐదేళ్లలో అభివృద్ధిలో గ్రామాలు తిరోగమనం బాట పట్టాయన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE