Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరిని నెం.1గా చేద్దాం…కలసిరండి!

-అన్నివర్గాల సహకారంతోనే అది సాధ్యం
-తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న నారా లోకేష్ భేటీలు

మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రస్థాయిలో నెం.1గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, అందరూ తమవంతు సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి.

మంగళవారం ఉండవల్లికి చెందిన కాపు సామాజికవర్గ ప్రముఖులు శింగంశెట్టి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వెంకటేశ్వర ఫైనాన్స్, సీఫుడ్స్, రెస్టారెంట్ వంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవల్లి పట్టణ వాసులకు సుపరిచితులుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అన్నిసామాజికవర్గాల వారికి చెందినదని, సమాజంలో అందరూ ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే అన్న ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3వేల కోట్లు ఖర్చుచేయడంతోపాటు కాపు భవనాలకు నిధులు, విదేశీ విద్య అమలు చేశారని తెలిపారు. అదేవిధంగా కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.

కాపుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. అనంతరం తాడేపల్లి 17వవార్డుకు ప్రముఖ వైద్యలు డాక్టర్ పలగాని శ్రీనివాసరావును ఆయన నివాసంలో కలిశారు. గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ పలగాని శ్రీనివాస రావు నిమ్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తాడేపల్లి రోటరీ క్లబ్ లో కీలకసభ్యుడిగా ఉంటూ సామాజికసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తర్వాత 15వవార్డుకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆంధ్రప్రభ పాత్రికేయుడు తాడిబోయిన నాగేశ్వరరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు.

యాదవ సామాజకవర్గానికి చెందిన నాగేశ్వరరావు గత పాతికేళ్లుగా తాడేపల్లిలో టీచర్ గా, విలేకరిగా సుపరిచితులు. ప్రస్తుతం ఎపియుడబ్ల్యుజె జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాత్రికేయుల గొంతునొక్కే చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో అందరినీ తాము సమానంగా గౌరవించామని చెప్పారు. మంగళగిరి అభివృద్ధికి మీ వంతు సహాయ,సహకారాలు అందించాల్సిందిగా యువనేత లోకేష్ విజ్ఞప్తిచేశారు.

LEAVE A RESPONSE