• పాలసీలు బలంగా చేసినా, అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది
• గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు
• గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉండేది
• గాడిలో పెట్టేందుకే మాకు సమయం సరిపోతోంది
• క్షేత్ర స్థాయిలో తప్పులను నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే
• రాజ్యాంగబద్ధంగా పని చేస్తే ప్రభుత్వ మద్దతు ఉంటుంది
• ప్రజల్లో చైతన్యం మెండుగా ఉంది.. తప్పు జరిగితే తిరగబడతారు జాగ్రత్త
• సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం
• జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి: గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయాయి. వ్యవస్థల్లోకి నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆవహించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. పట్టాలు తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికే చాలా సమయం వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన చెందారు. శాఖాపరంగా సమీక్షలు చేస్తున్నప్పుడు గత ఐదేళ్లలో వ్యవస్థలు ఎంత దారుణంగా పని చేశాయో తెలుసుకొంటుంటే ఆశ్చర్యపోవడమే నా వంతవుతోందన్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలని, ప్రజల బాగు కోసం, రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మొదలైంది.
ఈ సదస్సులో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రజల అభ్యున్నతి కోసం పాలసీలు చేయాల్సిన బాధ్యత పాలకులుగా మాపై ఉంటే… దానిని అంతే సక్రమంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థగా కలెక్టర్లపైన ఉంటుంది. అప్పుడే ప్రజలకు మంచి పాలన, సుస్థిరమైన అభివృద్ధి సమపాళ్లలో అందుతుంది. గత ఐదేళ్లుగా ఈ పద్ధతి పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సాగిన అప్పటి పాలనను కలిసికట్టుగా ఎదుర్కోవాలనే గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి వారి ఆశీర్వాదం పొందాం. గత ప్రభుత్వ హయాంలో మేం ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొనే ముందుకు వెళ్లాం. అప్పటి పాలకులు చట్టాలు, నిబంధనలు పట్టించుకోలేదు.
కళ్ల ముందే తప్పు జరుగుతున్నా స్పందించలేదు
రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను నియంత్రించే శక్తి ఉన్న బ్యూరోక్రసీ కూడా నిస్సహాయంగా ఉండటం చూసి బాధ కలిగించింది. ఇంతమంది బ్యూరోక్రాట్లకు అప్పట్లో జరిగిన అన్యాయాలను ఎదిరించే ధైర్యం లేకపోయింది. ఆ నిస్సహాయత నుంచే మేం రోడ్ల మీదకు వచ్చి ప్రజల తరఫున పోరాడాం. సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక వరకు, మద్యం అమ్మకాల దగ్గర నుంచి సహజ వనరుల దోపిడీ వరకు కళ్లముందే తప్పు జరుగుతున్నా అప్పట్లో ఎవరూ స్పందించలేదు. కష్టపడి సివిల్స్ పాసై ముస్సోరిలో ఐఏఎస్, హైదరాబాద్ లో ఐపీఎస్ శిక్షణ పొంది, పాలనలో నిష్ణాతులుగా బయటకు వచ్చే అధికారులు గత ప్రభుత్వంలో ఏం జరిగినా మౌనంగా ఉండిపోవడం చూసి ఆశ్చర్యమేసేది. సిరియా, శ్రీలంక వంటి దేశాల్లో పాలకులు విఫలమైనా కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా నిలబడి పరిస్థితిని చక్కదిద్దింది.
గత ప్రభుత్వ పాలకులు చేసిన ఎన్నో ఆకృత్యాలకు ప్రజలు బలయ్యారు. ఇప్పుడు కుప్పలుతెప్పలుగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే బాధేస్తోంది. జీతభత్యాలు లేక ఉద్యోగులు, సిబ్బంది బాధపడ్డారు. ప్రజలకు అన్ని విషయాల్లోనూ బాధలు ఎక్కువయ్యాయి. సత్యసాయి జిల్లాలో వాటర్ స్కీమ్ లో పని చేసే క్షేత్ర స్థాయి సిబ్బందికి వేతనాలు నెలల తరబడి అందలేదని నా దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాం. అలాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా పనిచేయాలి. అప్పుడే అన్ని వర్గాలకు సరైన మేలు జరుగుతుంది. ప్రజలలో ఇప్పుడు బలమైన చైతన్యం ఉంది. ఏ తప్పు జరిగినా వారు తిరగబడతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సీరియస్ గా పని చేయాలి. నిర్లక్ష్యాన్ని వీడాలి.
మూడు చెక్ పోస్టులు పెట్టినా స్మగ్లింగ్ జరుగుతోంది
కాకినాడ పోర్టులో ఇటీవల నేను పర్యటించినప్పుడు అక్కడ జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్ పరిస్థితి చూసి షాక్ అయ్యాను. నేను పర్యటించక ముందు చాలాసార్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి స్మగ్లింగ్ నిరోధం కోసం సూచనలు చేశారు. మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ నేను వెళ్లి స్వయంగా పరిశీలించిన సందర్భంగా ఎన్నో అవకతవకలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా జరగడం చూసి వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అర్ధమైంది. పాలకులు చెబుతున్న విషయాలను బ్యూరోక్రాట్లు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అక్కడున్న కలెక్టర్ తోపాటు జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిన బాధ్యత ఉంది.
స్మగ్లింగ్ నిరోధించకపోతే…
కేవలం బియ్యం స్మగ్లింగ్ కోసం మాత్రమే నేను ఆ రోజు మాట్లాడలేదు. స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు నిరోధించలేకపోతే దేశానికి హాని కలిగించే తీవ్రవాద మూకలు, పేలుడు పదార్ధాలు సులభంగా దేశంలోకి రావడానికి ఆస్కారం ఉంది. 2008లో కసబ్ లాంటి తీవ్రవాదులు ముంబై పోర్టు నుంచి దేశంలోకి వచ్చి 300 మంది ప్రాణాలు బలిగొన్నారు. కాకినాడ పోర్టు భద్రంగా లేకపోతే అలాంటివి జరగవు అని గ్యారెంటీ ఏంటి..? కేవలం అక్రమ బియ్యం నిరోధం పైనే కాకుండా రాబోయే విపత్తులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఏపీ సివిల్ సర్వీస్ అధికారులు నాడు – నేడు
నేను చెప్పేది ఒక్కటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం సమన్వయంతో పని చేయాల్సిన సమయం ఇది. మీరు మరింత జాగ్రత్తగా పని చేయాలి. ముఖ్యమంత్రి ఉచిత ఇసుక విధానం మీద చాలాసార్లు సమీక్షలు చేసి పలు సూచనలు చేశారు. నేను కూడా పలు శాఖలపై వాటి పని తీరుపై ప్రభుత్వ విధానాలను బ్యూరోక్రాట్లకు తెలియజేస్తున్నాను. వ్యవస్థల్లో చాలా నిర్లక్ష్యం పేరుకుపోయింది. దీన్ని పూర్తిగా తొలగించాలి. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. దానిని మీ సహకారం లేకుండా మేం చేరుకోలేమని భావిస్తున్నాం.
గతంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారులంటే దేశం మొత్తానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారని, ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా కొందరు పెద్దలు చెప్పడం నాకు గుర్తు ఉంది. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సివిల్ సర్వీస్ అధికారులు ఎలా ఉండకూడదో ఆంధ్ర అధికారులను చూపిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. మీరు ప్రజలకు మంచి చేస్తే మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మీ ఆలోచనలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేవి అయితే మేం వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మీ పర్యవేక్షణలోనే తీసుకుంటాం.
ఒకప్పుడు సైబరాబాద్ ప్రాంతం రాళ్లురప్పలుగా ఉండేది. ఆ రాళ్లురప్పల్లోనే భవిష్యత్తును చూపిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన నాయకత్వంలో, మార్గదర్శకంలో మనమంతా పనిచేయడం అదృష్టంగా భావించాలి. రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకున్న విజన్ అద్భుతం. దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తే రాష్ట్రం కచ్చితంగా అభివృద్ధి ఆంధ్రగా మారుతుంది. మీ చేతిలో అతి పెద్ద జిల్లా వ్యవస్థలున్నాయి. వాటిని ప్రజల కోసం, పాలసీలను వారికి అందించడం కోసం బలంగా పని చేయించే బాధ్యత మీ మీద ఉంది. దాన్ని పటిష్ఠంగా అమలు చేసేలా చూడండి. అంతా కలిసి వ్యవస్థలను బలోపేతం చేద్దాం. సరికొత్త ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు సమష్టిగా ముందడుగు వేద్దామని అన్నారు.