కరణం బలరాం కొడుకు వెంకటేష్ నుంచి నాకు ప్రాణహాని

– సునీతకు అనుకూలంగా పనిచేయవద్దని బెదిరిస్తున్నాడు
– మాట వినకపోతే చంపేస్తానని నా భర్తను హెచ్చరిస్తున్నాడు
– కాపాడాలని ఎస్పీకి పద్మశాలి కార్పొరేషన్ డైరక్టర్ ఫిర్యాదు

విజయవాడ: చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కొడుకు కరణం వెంకటేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరక్టర్ గోలి కుమారి ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతకు అనుకూలంగా పనిచేస్తే ప్రాణాలు దక్కవంటూ, కరణం వెంకటేష్ చేస్తున్న హెచ్చరికలతో తన కుటుంబం అభద్రతో ఉందని గోలి కుమారి భయాందోళన వ్యక్తం చేశారు. సునీతకు అనుకూలంగా పనిచేస్తే చంపేస్తానని, తన భర్త గోలి ఆనందరావును కరణం వెంకటేష్ బెదిరించిన నాటి నుంచి తనకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వాపోయారు. ఈ విషయాన్ని ఆమె ఎస్పీ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే గోలి కుమారి శుక్రవారం నాడే ఫిర్యాదు చేయగా, ఈ వ్యవహారం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

బాపట్లలో ఈనెల 5న వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తన భర్త ఆనందరావును, ఎమ్మెల్సీ సునీతకు మద్దతుగా తిరగడం మానుకోవాలని వెంకటేష్‌ బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
వెంకటేష్‌, ఆయన అనుచరుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని కుమారి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి పోలీసుల రక్షణ కల్పించాలని, బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Leave a Reply