– విద్యార్థుల కలలకు రెక్కలు తొడుగుదాం
– విదేశాల్లో చదవాలనుకునేవారికి ప్రభుత్వ హామీ
– అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యం
– సంక్షేమ శాఖలదే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ అమలు బాధ్యత
– సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి : రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిమితి లేకుండా, ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండాలని చెప్పారు. అలాగే దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని సూచించారు.
ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చెప్పారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామని అన్నారు. మరోవైపు బీసీ విద్యార్థులు ఐఐటీ, నీట్లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూఖ్, సవిత, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
అందరికీ నాణ్యమైన విద్య అందాలి
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు అధ్యయనం చేయాలని, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది తన సంకల్పమని, అధికారులు ఇందుకోసం కృషి చేయాలని సీఎం చెప్పారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు ఏడాదిలోగా మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
గురుకులాల్లో హైజీన్ పరిస్థితులు ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలను రూ.2.65 కోట్లతో జూనియర్ కాలేజీగా ఉన్నతీకరించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. అలాగే తల్లికి వందనం పథకం నుంచి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు నిధులు ఇస్తామని వెల్లడించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన రూ.1,700 కోట్లు కాలేజీలకు చెల్లించకపోవడంతో విద్యార్థులే రూ.900 కోట్లు చెల్లించారని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇంకా యాజమాన్యాలకు సుమారు రూ.800 కోట్ల బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చెల్లించాల్సి ఉందని వివరించారు.
అన్నివర్గాలు బలోపేతం కావాలి
సంక్షేమ శాఖలు ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ లక్ష్యం నెరవేరితే ఆయా వర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఇమామ్లు, పాస్టర్లకు బకాయిలు ఏమైనా ఉంటే వెంటనే విడుదల చేయాలని… అలాగే హజ్ యాత్రకు దరఖాస్తుల గడువును పెంచేందుకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్ ప్రాపర్టీ ఆడిట్ జరిగింది… అయితే ప్రస్తుతం వాటి ఆస్తుల స్థితిగతులు తెసుకునేందుకు మదింపు జరగాలన్నారు. ఆదరణ-3 కింద ఇచ్చే పనిముట్టు ఆధునికంగా, ఆయా కుల వృత్తులకు ఉపయోగకరంగా ఉండాలని సీఎం అన్నారు. రజకులకు గ్యాస్తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, సబ్సిడీ సిలిండర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. వెనుకబడిన వర్గాల ఆదాయార్జనకు కొత్త మార్గాలను అన్వేషించాలని సీఎం అన్నారు. మత్స్యకార వర్గాలు సీవీడ్ లాంటి నూతన ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలన్నారు.
వెనుకబడిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలని, ప్రభుత్వం ఈ వర్గాలపై పెద్దఎత్తున వ్యయం చేస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదన్నారు. కులవృత్తుల్లో ఆధునీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా… అందరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా… అధికార యంత్రాంగం చూడాలని, సంతృప్తి పరచాలని సీఎం సూచించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయ పరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పురోగతిలో ఉన్న నెల్లూరు, ఏలూరు, కర్నూలు బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 64 కులాల కార్పొరేషన్లలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల్ని అధ్యయనం చేసేందుకు అన్ని వర్క్ షాపు నిర్వహించాలని సూచించారు.
బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో ఈ ఏడాది ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో కొందరు విద్యార్థులు సమీక్షా సమావేశానికి ముందు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన సీఎం చంద్రబాబు.. ఉన్నత విద్యలో మరింత రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.