Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్సీ, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ లపై క్రిమినల్ కేసు దాఖలు చేసిన లోకేష్

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసిన నారా లోకేష్
– సీనియర్ లాయర్ దొద్దాల కోటేశ్వరరావు

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ అయిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు నారా లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు సీనియర్ లాయర్ దొద్దాల కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం కోటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ ఏడాది ఆగష్టులో లోకేష్ పిన్ని, దివంగత ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరీ ఆత్మహత్య చేసుకున్న విషాద సంధర్బంలో గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి లోకేష్ గారిపై సామాజిక మాధ్యమాల్లో (ట్విట్టర్ లో) దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరీ గారి మరణానికి జూబ్లిహిల్స్ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని అనుచిత రాతలు రాశారు.

అసలు ఆ సర్వే నంబర్లే ఫేక్ అని తేలడంతో గుర్రపాటి దేవేంధర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేళ్వరి గారిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాసి పరువునష్టం కలిగించడంతో క్రిమినల్ కేసు వేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

పోతుల సునీత అనుచిత వ్యాఖ్యలు
04.09.2022 న తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత నిర్వహించిన మీడియా సమావేశంలో… చంద్రబాబు నాయుడిని సారా చంద్రబాబు నాయుడిని అని పిలవాలంటూ, వీరు.. పైకి హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. బి3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని తప్పుడు వ్యాఖ్యలు చేశారు.

భువనేశ్వరి, బ్రాహ్మణి తాగి కొట్టుకున్నారని వార్తల్లో వచ్చింది. పప్పు నాయుడు లోకేష్ కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదంటూ.. చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని వ్యాఖ్యానించారు. మీడియా ముందు ఏం మాట్లాడాలన్న మందు తాగి వచ్చేవాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఇందుకు సాక్ష్యాలుగా మీడియా సమావేశంకు సంబంధించిన వీడియో, సాక్షి పత్రికల్లో ప్రచురితమైన కధనాలు జత చేసి కోర్టుకు సమర్పించారు.

సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న లోకేష్ గారు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తప్పుడు ఆరోపణలతో లోకేష్ గారి కుటుంబ సభ్యుల పరువు, ప్రతిష్టతలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని, దీనిపై ఐపిసి సెక్షన్ 499, 500 ల ప్రకారం గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, పోతుల సునీతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

LEAVE A RESPONSE