Suryaa.co.in

Andhra Pradesh

బడి సంచి బరువును తగ్గించనున్న లోకేష్

(ఘంటా వీరభద్రరావు)

అమరావతి: రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి రూపు మారిన కొత్త పాఠ్యపుస్తకాలు మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారుల పుస్తకాల సంచి (బ్యాగ్‌) బరువును తగ్గిస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

అందుకు అనుగుణంగా 1, 2 వ తరగతులకు సంబంధించి తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్య పుస్తకంలో, అదే విధంగా దానికి సంబంధించిన వర్క్‌ బుక్‌లను కలిపి మరొక దానిలో నూతనంగా ముద్రించారు. అంటే ఇక మీదట విద్యార్థులకు రెండు పుస్తకాలు మాత్రమే తమ సంచిలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇలా సెమిస్టర్‌ల వారీగా ఏటా రెండు సార్లు పుస్తకాలు అందజేస్తారు. 3, 4, 5 వ తరగతులకు గతంలో నాలుగు పాఠ్య పుస్తకాలు, నాలుగు వర్క్‌ బుక్‌లు ఉండేవి. వాటితో కలిపి మొత్తం ఎనిమిది పుస్తకాలను విద్యార్థులు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు మారిన విధానంలో తెలుగు – ఆంగ్లం ఒక పుస్తకంలో, గణితం – ఈవీఎస్‌ మరో పుస్తకంలో ఉంటాయి. వాటి వర్క్‌ బుక్‌లూ అలానే ముద్రించారు. అంటే మొత్తంగా కలిపి వీరికి నాలుగు పుస్తకాలే ఇప్పుడు బ్యాగ్‌లో ఉంటాయి. దాంతో చిన్నారులకు బడి సంచి బరువు తగ్గుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

LEAVE A RESPONSE