– హైకోర్టు తీర్పుతో రాజధాని గ్రామాల్లో పండగ వాతావరణం
– నీలకంఠేశ్వర స్వామి సేవలో నారా లోకేష్
– లోకేష్ కు హారతి ఇచ్చి గ్రామంలోకి ఆహ్వానం
పార్టీ కార్యకర్తల ఇళ్లకూ వెళ్లిన టీడీపీ యువనేత
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన జోష్ రాజధాని పరిధి గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి పర్యటనలో భాగంగా రాజధాని గ్రామమైన నీరుకొండకు వెళ్లారు. రాజధాని రైతులు కొనసాగించిన
ఉద్యమానికి ఆది నుంచి అండగా నిలుస్తూ వచ్చిన నారా లోకేష్ ను చూడగానే.. నీరుకొండ ప్రజలు జయజయధ్వానాలతో హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్ అనంతరం గ్రామంలో పర్యటించి
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.