Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా

-మీలో ఒకడిగా ఉంటూ సేవలందిస్తా…ఆశీర్వదించండి
-తటస్థ ప్రముఖులతో నారా లోకేష్ వరుస భేటీలు

తాడేపల్లి: మంగళగిరి రాష్ట్రం మొత్తమ్మీద అభివృద్ధిలో ముందుంచాలన్నదే తన ధ్యేయమని, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణంలోని పలువురు తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలుత తాడేపల్లి 20వవార్డులో నివాసం ఉంటున్న నిర్మాణసామగ్రి వ్యాపారి మలిశెట్టి శ్రీనివాసరావు ఇంటికివెళ్లారు. వారి కుటుంబసభ్యులు యువనేతకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు వ్యాపారంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తూ… ఇసుక అందుబాటు ధరల్లో లేకపోవడంతో అన్నిరకాల నిర్మాణాలు దెబ్బతిన్నాయని తెలిపారు. మరోవైపు అమరావతి నిర్మాణ పనులు కూడా నిలిపివేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

లోకేష్ స్పందిస్తూ… మరో రెండునెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక పాలసీని తెచ్చి నిర్మాణ రంగానికి గతవైభవం చేకూరుస్తానని భరోసా ఇచ్చారు. తర్వాత తాడేపల్లి 18వవార్డులో నివాసముంటున్న లారీ ట్రాన్స్ పోర్టర్ ముత్తే శ్రీనివాసరావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తమ కష్టాలను చెబుతూ… గత కొంతకాలంగా పన్నుపోటుతో రవాణారంగం కుదేలైందని వాపోయారు. 200 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ ను 20రెట్లకు పైగా పెంచారని వాపోయారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ… యువగళం పాదయాత్ర సందర్భంగా తనను ట్రాన్స్ పోర్టు రంగానికి పలువురు కలిశారని, యజమానులుగా ఉన్న తాము డ్రైవర్లుగా మారిపోయామని చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక అడ్డగోలు పన్నులను పునఃసమీక్షించి, దేశం మొత్తమ్మీద తక్కువ పన్నులు ఉండేలా చేసి ట్రాన్స్ పోర్టు రంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. చివరగా తాడేపల్లి 18వవార్డుకే చెందిన మక్కపాటి ఉమాశంకర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉమాశంకర్ యువనేత దృష్టికి తెచ్చారు.

లోకేష్ స్పందిస్తూ… దేశంలోనే మొట్టమొదటగా 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు గారే. గత టిడిపి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా 5ఏళ్లలో బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.285 కోట్లు ఖర్చు చేసామని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ని మరింత బలోపేతం చేసి, బ్రాహ్మణులని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు.

LEAVE A RESPONSE