Suryaa.co.in

Andhra Pradesh

స్మశానమా?.. చెరువు తవ్వేద్దాం!

– ఇదీ కృత్తివెన్ను మారాజుల భూదాహం
(బహదూర్)

మారాజులు.. దళితుల స్మశానాలనూ వదలట్లేదు. వందల ఎకరాల్లో చెరువులు తవ్వేస్తూ.. బడుగు జీవుల తాత ముత్తాల జ్ఞాపకాలనూ తుడిచేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోనే ఈ అరాచకం చోటు చేసుకుంది. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీ నిడమర్రు దళితవాడ కు చెందిన స్మశాన వాటికనూ చెరువుగా మార్చేస్తుంటే.. తల్లడిల్లిన దళిత పిల్లలు కృత్తివెన్ను తాహసీల్దారును కలిసి .. తమ స్మశానాన్ని కాపాడమని వేడుకున్నారు.

నిడమర్రు దళిత వాడకు చెందిన స్మశాన వాటికలో కిరణ్ రాజు అనే గలీజుదారుడు చెరువుగా మార్చేస్తున్నాడు. అదే మని ప్రశ్నించగా మీ పెద్దలు మాకు అప్పజెప్పిన భూమి ఇది, స్మశాన వాటిక కాదు, లీజుగా మాకు ఇచ్చిన భూమి అంటూ హూంకరించాడు. ఇక దళిత యువకులు తట్టుకోలేక కృత్తివెన్ను తాహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.

తమ పూర్వీకుల నుంచి స్మశానంగా వినియోగిస్తున్న ఈ భూమిని ఈ మారాజులు కొల్లగొడుతున్నారని, చెరువులుగా మారుస్తున్నారని, మా స్మశానాన్ని కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా ఆర్డీవో మాత.. ఒక్కసారి నిడమర్రులో పర్యటించు తల్లీ. ఇక్కడ జరుగుతున్న ఘోరాలను వీక్షించి.. తగు చర్య తీసుకో తల్లీ అంటూ కృత్తివెన్ను దళితులు వాపోతున్నారు.

LEAVE A RESPONSE