Suryaa.co.in

Andhra Pradesh

చెట్టుమీద పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారు

– జగన్ వేటు దళిత ఎమ్మెల్యేలపైనా? ఇది చాలా అన్యాయం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

చెట్టుమీద పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు…

జగన్ తన పార్టీని ఒక ‘‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’’గా నడుపుతున్నాడు
జగన్ తన పార్టీని ఒక ‘‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’’గా నడుపుతున్నాడు. జగన్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయులతో వ్యవహరిస్తున్న తీరు ప్రైవేటు కంపెనీని నడుపుతున్నట్లుగా ఉంది. మళ్లీ జగన్ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడంలేదు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే బదిలీ (ట్రాన్స్ ఫర్) చేయాలి. 12 మంది దళిత శాసనసభ్యుల్ని ట్రాన్స్ ఫర్ చేయడం అవివేకం, వారిని రాజకీయాల్లో స్థిరపడకుండా చేయడంలో భాగమే ఇది. నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయడానికి దళితులు సమర్థులు కారా? జగన్ మాటలు నమ్మి అత్యుత్సాహంతో ఓట్లు వేసిన దళితుల్ని జగన్ అడుగడుగునా అవమానిస్తున్నారు.

‘‘మేము వైసీపీ పార్టీలో ఉండబోమ’’ని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. వయసులో అధికుడైన దళితుడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుపతి బహిరంగ సభలో చేతులు కట్టుకొని నిలబడితే, వేదికపై కుర్చీలలో రెడ్లు కూర్చొని దళితుల్ని తీవ్రంగా అవమానించారు. పినిపే విశ్వరూప్ కు సీటు లేక మోకాళ్లపై నిలబెట్టడం వైసీపీ దళితులకిచ్చే గౌరవాన్ని తెలియజేస్తోంది. మేకల్నే బలిస్తారు, పులులను కాదు అని అంబేద్కర్ ఏనాడో చెప్పారు, అందుకే 12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేశారు. అంబేద్కర్ పై జగన్ కు చిత్తశుద్ధి లేదు, ఉంటే అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టుకోరు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టిస్తే చిత్తశుద్ది ఉన్నట్లు కాదు. ఆయన ఆశయాలు పాటిస్తేనే చిత్తశుద్ది ఉన్నట్లు.

చిత్తశుద్ధి లేకుండా అంబేద్కర్ విగ్రహం పెద్దది పెడితే దళితులపై దాడులకు పాల్పడడం పోతుందా?
188 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్న పాపం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే పోతుందా? జగన్ ప్రజా రక్షకుడు కాదు, ప్రజా బక్షకుడని కోడికత్తి శీను కేసులో స్పష్టమైంది. ఐదేళ్లుగా అతను జైల్లో మగ్గుతుంటే, జగన్ అంబేద్కర్ విగ్రహం వేస్తే సరిపోతుందా? డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలో నుంచి అత్యుత్సాహంతో వైసీపీలోకి వెళ్లి అడుగడుగునా అవమానాలకు గురవుతున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే జగన్ చేసుకున్న పాపాలు పోతాయా? అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంబేద్కర్ పై గౌరవంతో కాదు.. రాజ్యాంగంపై జగన్ కు చిత్తశుద్ధి లేదు, రాజకీయ లబ్ధి కోసమే ఈ అగచాట్లు. నిజంగా అంబేద్కర్ పై చిత్తశుద్ధి ఉంటే అమరావతిలోని స్మృతివనాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి ‘‘యాత్రాస్థలం’’గా మార్చి ఉండాల్సింది.

జగన్ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడంలేదు
జగన్ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలు ఇష్టపడటంలేదని జగన్ గ్రహించారు. జగన్ పెట్టిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వైసీపీ అని పెరు పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో పనిచేసేవారే ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో స్టోర్ డిపార్టుమెంటు వారిని తీసి హెచ్ఆర్డీలో పెడతారు, హెచ్ ఆర్ డీ వారిని సేల్స్ లోకి మార్చినట్లుగా జగన్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కంపెనీ ఛైర్మన్, సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ లు కంపెనీలోనివారిని ఎలాగంటే అలా ట్రాన్స్ ఫర్లు చేస్తుంటారు. వైసీపీ కూడా అలాగే కంపెనీ అనుకొని ఆ విధంగా మారుస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలను బదిలీలు చేయడం మొదటిసారి చూస్తున్నాం. పార్టీ అధ్యక్షుడు అయోమయంలో జగన్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పార్టీని నడపడంలో అతను పూర్తిగా వైఫల్యం చెందాడు. దీనికి నిదర్శనమే ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు. వైఎస్సార్ పార్టీ (ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ)లో ఉండటానికి ఎమ్మెల్యేలు ఇష్టపడటంలేదు. మారాలనుకుంటున్నారు. 174 మంది ఇన్ ఛార్జులు, క్యాండిడేట్స్ ని కాదు మార్చాల్సంది, ట్రాన్స్ ఫర్ కావాల్సింది జగన్నే. జగనే మారాలి.

ఎమ్మెల్యేలను కాకుండా జగన్ ని బదిలీ చేయాలి
వెంటనే జగన్మోహన్ రెడ్డిని ట్రాన్స్ ఫర్ చేయాలి. అందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్ సీఎం పదవికి అర్హుడు కాదు. కావున ట్రాన్స్ ఫర్ చేయాలి. ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జగన్ తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులే చెబుతున్నారు. దళిత ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. 29 చోట్ల దళిత ఎమ్మెల్యేలను పెట్టాల్సివుంది. ఇవి రిజర్వ్ సీట్లు. షెడ్యూల్ క్యాస్ట్ వారినే పెట్టాలి. వేరేవారిని పెట్టడానికి వీలులేదు.

రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం జగన్ కు లేదు
రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం జగన్ కు లేదు. జగన్ అబద్ధపు, అసత్యపు మాటలు విని, దొంగ వాగ్దానాలను నమ్మి దళితులు ఎగిరెగిరి ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. దళితుల్ని అవమానాలకు గురిచేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. దళితులన్ని ఇనుప పాదాల కింద వేసి తొక్కేయడమే జగన్ లక్ష్యమా? దళితుడు నాయకుడిగా స్థిరపడడం జగన్ కు ఇష్టంలేదు. జగన్ కు దళితులపై ఒక రకమైన ఈర్ష్యాభావాలున్నాయి. దళితులందరూ మీ పాదాల కింద నలిగి ఉండాలనుకోవడం సరికాదు. అత్యుత్సాహంతో జగన్ కు ఓట్లు వేసి గెలిపించిన దళితులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

తెలుగుదేశం హయాంలో దళితులు తలెత్తుకు తిరిగారు
తెలుగుదేశం హయాంలో దళితులు తలెత్తుకు తిరిగారు, జగన్ హయాంలో దళితులకు అన్నీ అవమానాలే. తిరుపతి సభలో రెడ్లందరూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే దళితుడైన ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వారి వెనుక నీ బాన్చన్ దొర అని చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. దళిత మనిష్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కాలం గడుపుకోవడానికే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటారు, చేసేది శూన్యం.

ఇతరులపై తీసేసి, దళితులపై ఉన్న కేసులనెందుకు తీయరు?
గతంలో ఆందోళనలు జరిగినప్పుడు అనేక మందిపై కేసులు పెట్టారు, ఇతరులపై కేసులు తీసేసి దళితులపై ఉన్న కేసులు ఎందుకు తీసేయరు? విశ్వరూప్ గారు, దళిత ఎమ్మెల్యే, ఎంపీలు, సమాధానం చెప్పాలి. జగన్ ముఖారవిందాన్ని చూసే యోగం డొక్కా మాణిక్య వరప్రసాద్ కు దక్కకపోవడం బాధాకరం. డాక్టర్ అంబేద్కర్ పేరు తీసేసి, జగన్ పేరు పెట్టినప్పుడు దళిత నాయకులకు రక్తం సల సల కాగాల్సింది, ఇది కరెక్టు కాదని ఎంపీలుగానీ, ఎమ్మెల్యేలుగానీ, మంత్రులుగానీ, డిప్యూటీ సీఎంగానీ చెప్పి ఉండాల్సింది.

16 నెలలు జైల్లో ఉన్న జగన్ ఎక్కడా? ప్రపంచ మేధావి అంబేద్కర్ ఎక్కడ?
జగన్ 11 కేసులు ఉండి చంచల్ గూడ జైలులో 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు జీవితం గడిపి వచ్చిన జగన్ ఎక్కడా? ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ ఎక్కడ? కోర్టు తీర్పు ఇస్తే ఆజన్మాంతం జైల్లో ఉండాల్సివస్తుంది. మీ ఇష్టమొచ్చినట్లు ఎడమ కాలితో తన్ను, కుడి చేత్తో గుద్దు, మేం పడివుంటాం, నోరుఎత్తి మాట్లాడము అంటున్నారు. 19 వ తేదిన విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభిస్తున్నామని చెబుతున్నారు. అది ఒక వర్గం మీద కక్షగట్టి ఏర్పాటు చేశారు.

జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ అంబేద్కర్ మీద చిత్తశుద్ది లేదు. రాజకీయ లబ్ది కోసం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. దళిత డ్రైవర్ ను చంపి ఒక వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరి చేసిన పాపం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన పోదు. చీరాల బిడ్డ కిరణ్ కుమార్ ను మాస్క్ వేసుకోలేదని కొట్టి కొట్టి చంపారు. దళితుడనే దురుద్దేశంతోనే చంపారు. ఆపాపం అంబేద్కర్ విగ్రహం పెడితే పోదు. కొడాలి నానీ చంద్రబాబును దుర్బాషలాడేవారు.

వేంప్రతాప్ అనే దళితుడు జగన్ బ్రాండ్ మద్యం ధరలు పెంచేసినందుకు ఏంరా జగన్ అన్నందుకు ప్రాణం తీశారు. అంబేద్కర్ విగ్రహం వేస్తే ఆ పాపం పోతుందా? నాగమ్మ పశువులు మేపుకోవడానికి వెళితే వైసీపీ నాయకులు రేప్ చేసి చంపేశారు. ఈ సంఘటనపై చర్యలు శూన్యం. మాదిగ రైతుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. రైతుల్ని బేడీలు వేసి జైల్లో పెట్టారు అంబేద్కర్ విగ్రహం పెట్టంగానే ఆ పాపం పోదు. దళితులపై అనేక కేసులు పెట్టారు, అనేకమందిపై అత్యాచారాలు చేశారు.

దళితులపై జగన్ కు మనసులో కక్ష ఉంది
దళితులపైన జగన్ మనసులో కక్ష పెట్టుకొని ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కక్ష తీర్చుకుంటున్నట్లున్నారు. కేసులో ఇరుక్కుని జైలుకెళ్లిన ఎమ్మెల్సీ గోరంట్ల మాధవ్ విడుదలైతే సిగ్గు, శరం లేకుండా అతన్ని సన్మానించారు. పాలాభిషేకం చేశారు. జగన్ మీటింగ్ లలో పెద్ద పీట వేశారు. ఇది ఎంతవరకు సబబు? వైఎస్ ఆర్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఎమ్మెల్యేల బదిలీలతో స్పష్టమౌతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE