Suryaa.co.in

National

మంకీ పాక్స్‌… కేంద్రం అప్రమత్తం!

– హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్‌పై ప్రపంచ ‌ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అలాగే ఢిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు ఆర్టీ-పీసీఆర్‌ వ్యాధి నిర్థరణ పరీక్ష చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆఫ్రికాలో ఈ ఏడాది 18 వేలకుపైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. పొరుగుదేశం పాకిస్తాన్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ కేసుల్లో మరణాల రేటు 1 నుంచి 10 శాతం వరకు ఉంది.

లక్షణాలు ఇవే!

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, మంకీపాక్స్​ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇది ఆ వ్యక్తి ఇమ్యూనిటీ పవర్​పై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి నోరు, కళ్లు, గొంతు, ప్రైవేట్ భాగాలపై పొక్కులు రావొచ్చు.

ఎలా నివారించుకోవాలంటే?

మంకీపాక్స్‌ లాగా కనిపించే దద్దుర్లు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మంకీపాక్స్​ వైరస్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సంబంధం ఉన్న బట్టలు, దుప్పట్లు లేదా ఇతర వస్తువులను తాకకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు సబ్బు నీటితో చేతులను శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ చేతులు కడుక్కోవడానికి ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని యూజ్ చేయాలి. చివరగా దీని బారిన పడకుండా ఉండాలంటే ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకొని, అప్రమత్తంగా ఉండాలి.

LEAVE A RESPONSE