తెదేపా హయాంలో లోకేష్ తోడల్లుడు భరత్ కు కారుచౌకగా ప్రభుత్వ భూమి

– జగన్ ప్రభుత్వంలో లబ్దిదారుల్లో 99% మందికి నెలనెలా పెన్సన్ పంపిణీ
– కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలుసుకోవడం సంతోషదాయకం
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం : జగ్గయ్యపేట సమీపంలో జయంతిపురం వద్ద లోకేష్ తోడల్లుడు భరత్ కుటుంబానికి ఎకరం లక్ష చొప్పున ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టిన విషయం లోకేష్ కు గుర్తుండే ఉంటుందని, 2015లో విబిసి ఫెర్టిలైజర్స్ కోసమని రూ. 500 కోట్లు విలువగల 499 ఎకరాల ప్రభుత్వ భూమిని రాసిచ్చేసారని అయితే సంవత్సరాలు గడిచినా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ కేటాయింపును రద్దు చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. అదే అక్కసుతో లోకేష్ ఇప్పుడు శోకాలు పెడుతున్నాడని అన్నారు.

పెన్షన్ కోసం ఆపసోపాలు పడి, కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే పరిస్థితి నుంచి ఒకటో తారీకు వచ్చిందంటే చాలు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించే వ్యవస్థను సీఎం జగన్ రూపొందించారని అన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ కోసం నెలకు కేవలం రూ. 461 కోట్లు కేటాయిస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ.1,564 కోట్లు కేటాయిస్తోందని అన్నారు.

చంద్రబాబు హయాంలో 39 లక్షల మందికి పెన్షన్ అందించగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 62 లక్షల మందికి అందిస్తున్నారని అన్నారు. తెదేపా హయాంలో పెన్షన్ కోసం నెలకు ఖర్చు చేసింది కేవలం రూ.461 కోట్లు కాగా, వైకాపా ప్రభుత్వంలో రూ. 1564 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. 60 నెలల్లో చంద్రబాబు పాలనలో పెన్షన్ కోసం ఖర్చు చేసింది కేవలం రూ. 27687 కోట్లు మాత్రమే కాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేవలం 34 నెలల్లో ఏకంగా రూ. 48104 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ లబ్దిదారుల్లో కేవలం 88% మందికి మాత్రమే పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 99% మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ జరుగుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్ లబ్దిదారులు రెట్టింపు సంతోషంతో ఉన్నారని అన్నారు.

కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను మంగళవారం బెంగళూరులోని రాజ్ భవన్ లో కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ఈ క్రమంలో రాజ్యసభలో సహచరులుగా ఉన్న రోజులు గుర్తు చేసుకోవడంతో పాటు అనేక విషయాలు చర్చించుకోవడం జరిగిందని అన్నారు. రాజ్యసభ సహచరులుగా ఉన్న సమయంలో తమ మధ్య స్నేహపూర్వకమైన బలమైన బంధాన్ని గుర్తు చేసుకున్నట్లు తెలిపారు.

ఇండియన్ ఆర్మీ చీఫ్ గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే కు హృదయపూర్వక శుభాబినందనలు తెలియజేస్తున్నానని, అయన సారధ్యంలో ఇండియన్ ఆర్మీ మరింత బలోపేతం కాగలదని, మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోగలదని భావిస్తున్నానని అన్నారు.

వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదినం సందర్భంగా ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆదర్శ సతీమణిగా, జననేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చిన ధన్య మాతగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆమెకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.

Leave a Reply