– ప్రభుత్వం, పోలీసుల అండతో ఎమ్మెల్యే ఆర్కే ఎంపీపీ కుర్చీ కబ్జా చేశారు
– టిడిపి ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలు వైసీపీ దాడులకి భయపడకుండా నిలబడ్డారు
– ఇదే స్ఫూర్తితో పనిచేద్దాం..మంగళగిరి నియోజకవర్గంపై టిడిపి జెండా ఎగురేద్దాం
– దుగ్గిరాల ఎంపీటీసీలు, టిడిపి నేతల సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఎంపీటీసీల బలంలేకపోయినా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కుట్రలు-కుతంత్రాలతో దుగ్గిరాల ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారని, ముమ్మాటికీ నైతిక విజయం తెలుగుదేశానిదేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో దుగ్గిరాల ఎంపీటీసీలు, టిడిపి నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల ప్రకటన వెలువడిన నుంచీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరితెగించి పాల్పడిన అక్రమాలన్నీ ఎదురొడ్డి పోరాడిన తెలుగుదేశం ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. దుగ్గిరాలలో టిడిపి అభ్యర్థుల్ని బెదిరించి విత్ డ్రా చేయించడంతో దౌర్జన్యాలు మొదలుపెట్టిన ఆర్కే..చివరికి మన మైనారిటీ సోదరి జబీన్కి బీసీ కులధ్రువపత్రం రాకుండా చేశారని, ఎంపీటీసీల బలం లేకపోవడంతో మనవాళ్లని బెదిరించి వైసీపీ వైపు తిప్పుకోవాలని చూశారని, అయినా ఒక్కతాటిపై నిలిచి తెలుగుదేశం సత్తా చాటారని ఎంపీటీసీలని ప్రశంసించారు.
జనసేనతో కలిసి 10 ఎంపీటీసీలు గెలుచుకున్న మనకి ఎంపీపీ దక్కకుండా, 8 మంది గెలిచి అందులో ముగ్గురు తిరుగుబాటు చేశారని కిడ్నాప్ చేసిన ఆర్కే…చివరికి ఐదుగురితో ఎంపీపీని ఎన్నుకోవడం ఓటమేనని లోకేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డ్రామాలకు కాలం చెల్లిందని, తెలుగుదేశంతోనే అభివృద్ధి-సంక్షేమం సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతుండడం వల్లే మీరంతా ఎంపీటీసీలుగా గెలిచారని…ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడి జనహృదయాలను గెలుచుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే ఆర్కే అరాచకాలు, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా టిడిపి బలోపేతం కోసం పనిచేస్తున్న మీరంతా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే, మంగళగిరి నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిచి తెలుగుదేశం జెండా ఎగురవేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.