కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముద్రగడతోపాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.
ముద్రగడ రాజకీయ పార్టీలో చేరబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరగడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరపడంతో ఆ పార్టీలో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీలో చేరబోతున్నట్టు ముద్రగడ ఇటీవల ప్రకటించారు. మొన్ననే ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నేతగా మారారు.
ముద్రగడ 1978లో జనతా పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాక అందులో చేరారు. ఉమ్మడి ఏపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు.
ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజికవర్గం వైఎస్సార్సీపీకి మద్దతిచ్చి కాపుల ఆకాంక్షలు నెరవేరేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి… pic.twitter.com/8HrShBHGR0
— YSR Congress Party (@YSRCParty) March 15, 2024