ఎస్సీ విద్యార్థుల కోసం విశాఖలో నీట్ జేఈఈ శిక్షణా కేంద్రం

• మెరుగైన ఫలితాల కోసం 56 అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ కేంద్రాలు
• ఎస్సీ గురుకుల సమీక్షలో మంత్రి నాగార్జున స్పష్టీకరణ

అమరావతి, మే 23: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలు కాకుండా అదనంగా మరో శిక్షణా కేంద్రాన్ని విశాఖ జిల్లాలోని మధురవాడలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 56 అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసామని చెప్పారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ల (డీసీఓ)ల సమీక్షా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ బాలుర కోసం అడవి తక్కెళ్లపాడు (గుంటూరు జిల్లా), చిన్నటేకూరు (కర్నూలు జిల్లా) లోనూ, బాలికల కోసం ఈడ్పుగల్లు (కృష్ణాజిల్లా) లోనూ నీట్, జేఈఈ శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ శిక్షణా కేంద్రాలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని బాలికల కోసం మరో శిక్షణా కేంద్రాన్ని మధురవాడలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ శిక్షణా కేంద్రంలో 160 మంది బాలికలకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఎస్సీ గురుకులాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర సగటును మించి ఫలితాలను సాధించాయని ప్రస్తావించారు. గురుకులాల విద్యార్థులు పదో తరగతిలో 80.38%శాతం, ఇంటర్మీడియట్ లో 74.13% శాతం ఫలితాలను సాధించారని చెప్పారు. అయితే పదో తరగతి ఫలితాల్లో ఒక జిల్లా వెనుకబడిందని, ఆ జిల్లాలో రాష్ట్ర సగటు కంటే తక్కువగా 71% శాతం ఫలితాలు మాత్రమే వచ్చాయని తెలిపారు. అలాగే జూనియర్ ఇంటర్ లో 63.19% శాతం ఫలితాలు మాత్రమే రాగా నాలుగు జిల్లాలు ఫలితాల సాధనలో వెనుకబడ్డాయని వివరించారు.

ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో 1400 మంది సింగిల్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వారు ఉన్నారని, వారందరూ ఉత్తీర్ణులయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా 56 అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. సింగిల్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాస్ అయితే ఇంటర్ పాస్ ఫలితాలు 80శాతం దాటిపోతాయన్నారు. డీసీఓలు తమ జిల్లాల పరిధిలో తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలలకు వెళ్లి వాటిలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గురుకులాల్లో విద్యార్థుల రోజువారీ హాజరును ప్రతిబింబిస్తూ డైలీ సిటుయేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) ను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలని, తద్వారా విద్యార్థులు అనుమతి లేకుండా బయటికి వెళ్లి ప్రమాదాల బారినపడే అవకాశం లేకుండా చూడాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని నాగార్జున ఆదేశించారు. కాగా గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 5వ తరగతిలో 14940 సీట్లు ఉండగా వీటిలో తొలి విడతగా 13881 మందిని ఎంపిక చేసామన్నారు.

జూనియర్ ఇంటర్ లో 13520 సీట్లు ఉండగా వీటిలో 13180 సీట్లకు తొలి విడతలోనే విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. అలాగే 5 నుంచి 9వ తరగతిలో మిగిలిపోయిన మరో 1450 సీట్లను కూడా ఆయా జిల్లాల స్థాయిలోనే భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. గురుకులాల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా మిగిలిపోకుండా చూసుకోవాలని నాగార్జున అధికారులను కోరారు.

వివిధ స్థాయిల్లో ఉన్న టీచర్లు, ప్రన్సిపాళ్ల కు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియను కూడా విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోపుగా పూర్తి చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. ప్రిన్సిపాల్స్ కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడకు వెళ్లి చేరాల్సిందేనని స్పష్టం చేసారు. ఈ సమావేశంలో సోషియల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.జయలక్ష్మి, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి, సంయుక్త కార్యదర్శి శివరావు, ఏఎంఓ ఎన్. సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply