Suryaa.co.in

Andhra Pradesh

అహం వద్దు.. అందరితో కలసి పనిచేయండి

– 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ – జనసేన పొత్తు
– విస్తృత కసరత్తు చేసి, ప్రజల ఆమోదం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేశాం
– అహంకారంతో జగన్ చేసిన విధ్వంసమే అతని పతనానికి నాంది
– ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది కదా అని నేతలు ఉదాసీనంగా ఉండొద్దు
– జగన్ కుట్రలు, కుతంతాలు చేస్తాడు…ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
– టికెట్ వచ్చేసిందని నేతలు ఈగోలకు పోవద్దు….అసంతృప్తిగా ఉన్న కార్యకర్తల వద్దకు ఒకటికి పది సార్లు స్వయంగా వెళ్లండి
– టీడీపీ -జనసేన ఇప్పటి నుంచే సమన్వయం చేసుకుంటే 100 శాతం ఓట్ల బదిలీ
– టీడీపీ తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్ధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అధినేత చంద్రబాబు నాయుడు
– సీట్లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపి… దిశానిర్దేశం చేసిన చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాలతో పాటు గెలుపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని, వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయని స్పష్టం చేశారు. తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్ధులతో చంద్రబాబు నాయుడు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపి, పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ…‘‘గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. పార్టీ అభ్యర్ధులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలి అని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాను. 1.3 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నాను. సర్వేలు పరిశీలించి, సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్ధుల ఎంపిక చేశాను.

దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ లో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో కీలకం. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం….నిత్యం ప్రజల్లో ఉండండి. ప్రజలకు భవిష్యత్ పై నమ్మకం, ధైర్యం కలిగేలా నాయకత్వం అందించండి అని చంద్రబాబు సూచించారు.

జగన్ అహంకారమే అతని పతనానికి నాంది
ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం…..ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించాం. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది కాబోతోంది. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్ ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. జగన్ ఎన్నికలకు సిద్దంగా లేడు….సిద్దం అని సభలు పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడు.

సీట్లు ఇచ్చేశారు….ప్రజల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా అని ఏ ఒక్కరూ ఎన్నికలను సులభంగా తీసుకోవద్దు. ఎంత సీనియర్ నేత అయినా…నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిముషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలి. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను మీరు కలుపుకుని పోవాలి. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పది సార్లు స్వయంగా వెళ్లి మీరే కలవాలి….నేనే అభ్యర్థి కదా అని ఈగోతో వ్యవహరిస్తే కుదరదు. తటస్థులను కలవండి…రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరండి అని చంద్రబాబు దిశా నిర్థేశం చేశారు.

జగన్ చేసే కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
జనసేన మన మిత్ర పక్షం. జనసేన నేతలను కలుపుకుపోవాలి…గౌరవించాలి. అలాగే జనసేన వాళ్లూ మీతో కలిసి ప్రయాణం చేయాలి. రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుంది. 5 ఏళ్ల పాలనపై గ్రామాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. మంచి వారు పార్టీలోకి వస్తే ఆహ్వానించండి.

జగన్ ఎన్నికల్లో గెలుపునకు తన పాలనను నమ్ముకోలేదు….దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడు. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోండి….ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోండి. మనం ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడు…అన్నింటికీ మీరు సిద్ధంగా ఉండాలి.’’ అని చంద్రబాబు అన్నారు. సీట్లు పొందిన నేతలకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెంటనే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు

 

LEAVE A RESPONSE