Suryaa.co.in

Andhra Pradesh

సింహం సింగిల్ గా వస్తే అడవిలో వదిలిపెడతారు

– అభ్యర్ధుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి
– టిడిపి-జనసేన ఒకే ధఫాలో 99 మందిని ప్రకటిస్తే..జగన్ రెడ్డి 77 మందిని ప్రకటించేందుకు 7 లిస్టులు ఇవ్వాల్సి వచ్చింది
– పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్న వైకాపా కాపు నేతలు జగన్ రెడ్డి కాపు ద్రోహాన్ని ఎందుకు ప్రశ్నించరు?
– రెడ్డిలను నియమించి జగన్ రెడ్డి పాలన చేస్తున్నారు
– బీసీలకు 56 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా?
-అధికారప్రతినిధి నాగుల్ మీరా

తెలుగుదేశం-జనసేన కూటమి ఉమ్మడిగా 99 సీట్లు ప్రకటించగానే వైకాపాకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని.. తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయిందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా విరుచుకుపడ్డారు. ఆధివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వైకాపా నాయకుల మాటల్లోనే వారి ఓటమి అంచన ఉన్నట్లు స్పష్టమౌతోంది. వై నాట్ 175 అన్న జగన్ రెడ్డికి టిడిపి-జనసేన అభ్యర్ధుల జాబితా ప్రకటించడంతో భయం పట్టుకుంది. ప్రజలు జగన్ రెడ్డిని తిరస్కరిస్తున్నారని వైకాపా నాయకులకు అర్ధమయ్యింది. చంద్రబాబు నాయుడు-పవణ్ కళ్యాణ్ కలయికతో వైకాపా ఉనికి కోల్పోయి ప్రమాదం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనే ప్రకటిస్తారు. దీనిపై వైకాపా నాయకులకు ఎందుకంత ఆసక్తి?.

జగన్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఎందుకు చెప్పడం లేదు?. జగన్ రెడ్డి 77 మంది అభ్యర్ధులను ప్రకటించడానికి నానాయాతన పడ్డాడు. టిడిపి-జనసేన కూటమి 99 మందిని ఒకేసారి ప్రకటించడం సంచలనాత్మకం కాదా? జగన్ రెడ్డి ప్రకటించిన 77 మంది కూడా చివరి వరకు ఉంటారో లేదో అన్న అభద్రతాభావంలో ఉన్నారు. ఎవరు ఉంటారో, ఎవరు ఊడుతారోనని మిగిలిన వారు అంతకంటే ఎక్కువ అభ్రతాభావంలో ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లు ఇస్తామంటే వద్దంటున్నారు. ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే కాదంటున్నారు.

వైకాపాకు అభ్యర్ధులు దొరక్క చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఒంగోలులో పోటీకి దింపుతున్నారు, మరొకాయనను నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసారావు పేటకు తెచ్చారు. ఇలా వైకాపా నాయకులను రెండు, మూడు జిల్లాలు దాటించాల్సిన గతి వైకాపాకు ఎందుకు పట్టింది? వైకాపా తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు లేరనడానికి ఇది సాక్ష్యం కాదా?

జగన్ రెడ్డి టిడిపి-జనసేన గురించి మాట్లాడుతూ సింహం సింగిల్ గా వస్తుందని అంటున్నారు. సింహం సింగిల్ గా రాదని జగన్ రెడ్డి గుర్తించుకోవాలి. ఒకవేళ వస్తే..అటవీశాఖ వారు పట్టుకుని అడవిలో వదిలిపెడతారు.

జగన్ రెడ్డి దుర్మార్గ, అరాచక పాలన చేసి దళితులు, బీసీలు, మైనారిటీల, గిరిజనులు తెలుగుదేశం-జనసేన సంకీర్ణ ప్రభుత్వంలోనే తమకు రక్షణ ఉంటుందని ఆకాంక్షిస్తున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన నేపధ్యంలో నాడు అన్ని పార్టీలు ఒకటి కాలేదా? రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. సొంత చెల్లి విమర్శిస్తే జగన్ రెడ్డి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడుతన్న అంబటి రాంబాబుకు సీటు ఉందా? కాపులపై దొంగ ప్రేమ వలకబోస్తున్న అంబటి రాంబాబుకు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

వైసీపీలో కాపు నాయకులు పాత్ర ఏమిటి? కాపులకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానన్న జగన్ రెడ్డి కనీసం వారికి వంద కోట్లు కూడా ఇవ్వలేదు. దీనిపై వైకాపా కాపు నాయకులు ఎందుకు మాట్లాడలేదు?. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే మీరెప్పుడైనా మాట్లాడారా? రాయలసీమలో సాంప్రదాయకంగా బలిజల సీటు అయిన రాజంపేటను మిథున్ రెడ్డికి ఇస్తే ఎందుకు మాట్లాడలేదు? వైకాపాలో సీట్లు వస్తాయో లేదో అన్న సందేహం ఉన్న వారే అతిగా మాట్లాడుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని అందరికీ అనుకూలమైన 99 మంది అభ్యర్ధులను చంద్రబాబు నాయుడు ఒకేసారి ప్రకటిస్తే వైకాపా నాయకులకు ఉలుకెందుకు?

రాష్ట్రంలో ప్రజల జీవితాలు బాగుపడాలంటే..జగన్ రెడ్డి అక్రమ దోపిడీని ఆపాలంటే, అప్పుల ఊబిలోకూరుకు పోయిన రాష్ట్రాన్ని కాపాడాలంటే.. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం ఉందని అందరూ భావిస్తున్నారు. సామాజిక న్యాయానికి పేటెంట్‌దారు తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయానికి పునాధి వేసింది ఎన్టీఆర్ అయితే..దాన్ని ఆచరణలో పెట్టింది చంద్రబాబు నాయుడు.

దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు తాడేపల్లి ఫ్యాలెస్ గేటు కూడా తెరుకోదని అందరికీ తెలిసిపోయింది. బలహీన వర్గాలకు జగన్ రెడ్డి పాలనలో తీవ్ర అన్యాయం జరిగింది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశానని చెబుతున్న జగన్ రెడ్డి..వాటికి ఒక్క రూపాయి అయిన నిధులు ఇచ్చారా? మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు సైతం ఒక్క రూపాయి లోను ఇవ్వలేదు. బాబాసాహెబ్ విగ్రహం పెట్టడం కాదు జగన్ రెడ్డి.. ఆ మహానుభావుడి ఆశయాలను అమలు చేశావా?

దళిత వర్గాలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశావ్. రూ.33 వేల కోట్లు దారిమళ్లించావ్. అంబేడ్కర్ పేరున ఉన్న విదేశీ విద్య పథకానికి ఆ మహానీయుని పేరు తొలగించి నీ పేరు పెట్టుకున్న నాడే జగన్ రెడ్డి మోసం దళితులు తెలుసుకున్నారు. అంబేడ్కర్ గారు రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచకపోతే..జగన్ రెడ్డి లాంటి నియంత దళితులకు సీట్లు కూడా ఇవ్వడు. విజయవాడ చరిత్రలో ఒక ఓసీ ప్రాతినిధ్యం వహించే సెంట్రల్ నియోజకవర్గం స్థానాన్ని ఒక దళితుడైన బి.ఎస్ జయరాజుకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అది సామాజిక న్యాయం పట్ల తెలుగుదేశంకు ఉన్న చిత్తశుద్ది.

నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్న జగన్ రెడ్డి..అదే వర్గాలు జగన్ రెడ్డి మా ద్రోహి అంటున్నాయి. రాష్ట్రంలో ఏ వర్గానికి నిరసన తెలిపే హక్కు లేదు.
తెలుగుదేశం-జనసేన పొత్తు, సీట్లు గురించి మే చూసుకుంటాం. వైకాపా వారు వారి సీట్లు గురించి ఆలోచించుకుంటే మంచిది. అంతేకానీ, మేం అభ్యర్ధులను ప్రకటిస్తే మీ కెందుకు ఉలుకు. జగన్ రెడ్డిది దాడుల ప్రభుత్వం తప్ప అభివృద్ధి ప్రభుత్వం కాదు. ఉత్తరాంధ్రకు సుబ్బారెడ్డి, ఈస్ట్, వెస్ట్ గోదావరిలకు మిథున్ రెడ్డికి, కృష్ణా, గుంటూరులకు అయోధ్య రామిరెడ్డి, రాయలసీమ పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను నియమించి జగన్ రెడ్డి పాలన చేస్తున్నారు.

వీరు తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు మీకు కనిపించరా? చంద్రబాబు నాయుడు బీసీలైన అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, మైనారిటీ నాయకుడైన షరీఫ్ లను ప్రక్కన పెట్టుకున్నారు. నీలా కుల అహంకారంతో తన సొంత కులాన్ని ప్రక్కన పెట్టుకోలేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఐదు విభాగాలుగా విభజించి జగన్ రెడ్డి తన సొంత కులానికి చెందిన ఐదు సామంత రాజులను నియమించుకున్నాడు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలోని బలహీన వర్గాలు జగన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయం అని వైకాపా నాయకులు గుర్తించుకోవాలి.

 

LEAVE A RESPONSE