జగన్ రెడ్డి కాదు…రివర్స్ రెడ్డి

-రాష్ట్రంలో పలు ఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయడు చంద్రబాబు ట్వీట్లు

అమరావతి:- రాష్ట్రంలో పరిస్థితులు, వివిధ ఘటనలపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. పత్రికల్లో వచ్చిన వివిధ ఘటనలపై చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ట్వీట్ చేశారు. పలు అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలను, వైఫల్యాలను తప్పు పట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సిఎం పర్యటన సందర్భంగా చెట్లు నరికివేత చర్యలను చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు.

సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశాం. కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను…అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు…చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? ఇదే కదా రివర్స్ పాలన అంటే.

నువ్వు జగన్ రెడ్డి కాదు…రివర్స్ రెడ్డి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి? అంటూ నర్సాపురం లో ఘటనపై చంద్రబాబు ప్రశ్నించారు. పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అంటూ రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ తరలిపోయిన అంశంపై టిడిపి అధినేత మరో ట్వీట్ చేశారు. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులను తరిమేసింది ఎవరు?

సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా…లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇక ప్రకాశం జిల్లాలో గిరిజనుల స్మశాన స్థలాన్ని వైసిపి నేతలు అక్రమించడంపై దారుణం అని చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసిపి పిశాచాలు పడ్డాయి.

వైసిపి స్థానిక నేతలు సమాధులను తవ్వేసి స్మశానాన్ని కబ్జా చేస్తే…అధికారులంతా ఏం చేస్తున్నారు? వ్యవస్థలు సమాధి అయిన చోట వచ్చే ఫలితాలు ఇవే. కనీసం ఉన్నతాధికారులు అయినా ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా చర్యలకు దిగాల్సి ఉంది అని టిడిపి అధినేత డిమాండ్ చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేశారు.

Leave a Reply